Warangalvoice

ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

వరంగల్ వాయిస్, ములుగు : ములుగు జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) గోదామును జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్. మంగళవారం తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే త్రైమాసిక తనిఖీల్లో భాగంగా, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ పరిశీలన జరిగింది. అదనపు కలెక్టర్ (రెవిన్యూ) సీహెచ్. మహేందర్ జి తో కలిసి స్ట్రాంగ్ రూమ్‌ను సందర్శించిన కలెక్టర్, అక్కడ భద్రపరిచిన ఈవీఎంలను పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాంకు సంబంధించిన రికార్డులను, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణను, కట్టుదిట్టమైన భద్రతా చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదాంలో అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తుగా ఏర్పాటు చేసిన ఫైర్ ఎక్స్‌స్టింగిషర్లను, ఇతర అగ్నిమాపక పరికరాలను కలెక్టర్ స్వయంగా తనిఖీ చేశారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. భద్రత విషయంలో ఎటువంటి అలసత్వం వహించకూడదని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు.

పారదర్శకతకు పెద్దపీట..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. “ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఈవీఎంల భద్రత విషయంలో జిల్లా యంత్రాంగం అత్యంత పారదర్శకతను పాటిస్తోంది. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే గోదాం సీల్ తీసి తనిఖీ చేయడం జరిగింది. పరిశీలన అనంతరం తిరిగి వారి సమక్షంలోనే సీల్ వేశాం,” అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సెల్ డిప్యూటీ తాహసిల్దార్ నితీష్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ మనోహర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *