
- Kishan Reddy: సీఎం రేవంత్రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి సంచలన ఆరోఫణలు చేశారు. రేవంత్ రెడ్డి గాలి మాటలను ప్రజలు అర్థం చేసుకున్నారని.. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని హెచ్చరించారు.
వరంగల్ వాయిస్, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డా లేక తానా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఎన్నికల హామీలు ఇచ్చారా అని నిలదీశారు. తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రాజెక్టుల విషయంలో తాను రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ నిధులు తీసుకువస్తున్నానని చెప్పారు. ఇవాళ(గురువారం) ఢిల్లీ వేదికగా మీడియాతో కిషన్రెడ్డి మాట్లాడారు.
రేవంత్ రెడ్డి గాలి మాటలను ప్రజలు అర్థం చేసుకున్నారని.. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని హెచ్చరించారు. తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు అయినా తాను అడ్డుకున్నట్లు రుజువు చూపించాలని రేవంత్రెడ్డికి సవాల్ చేశారు. చేతకాని, దమ్ములేని సీఎం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మెట్రోకు సంబంధించి మొన్న ప్రతిపాదనలు పంపారని గుర్తుచేశారు. సీఎంగా ఉన్న వ్యక్తి ఏమాత్రం అవగాహన లేకుండా దుందుడుకు వైఖరితో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మెట్రో కోసం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క పైసా లేదని.. ఆ నెపం తన మీదకు నెడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి సీఎం ఉండటం తెలంగాణ ప్రజల దురదృష్టకరమని చెప్పారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలని కిషన్ రెడ్డి హితవు పలికారు.
