
ములుగు కలెక్టర్ దివాకర టీఎస్
ఈ నెల 23న గిరిజన దర్బార్..
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం
వరంగల్ వాయిస్, ములుగు : జిల్లాలోని గిరిజన ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23న సోమవారం ఏటూరునాగారంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో ‘ప్రజావాణి – గిరివాణి’ (గిరిజన దర్బార్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణంగా ప్రతి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని, ఈ వారం ప్రత్యేకంగా ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించాలని కలెక్టర్ నిర్ణయించారు. జిల్లాలోని గిరిజనులు, గిరిజనేతరులు తమ సమస్యలపై అర్జీలను నేరుగా సమర్పించి అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ గిరిజన దర్బార్కు జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. దూరప్రాంతాల నుంచి కలెక్టరేట్కు రాలేని గిరిజన ప్రజలకు ఈ కార్యక్రమం ఎంతో మేలు చేస్తుందని, భూ సమస్యలు, సంక్షేమ పథకాలు, ఇతర మౌలిక వసతులపై వచ్చే వినతులను త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని కలెక్టర్ వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.