
దామెర ఎస్సై కొంక అశోక్
వరంగల్ వాయిస్, దామెర : విద్యా సంస్థల పరిసరాల్లో నిబంధనలకు విరుద్ధంగా పొగాకు ఉత్పత్తులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దామెర ఎస్సై కొంక అశోక్ హెచ్చరించారు. గురువారం ఆయన తన సిబ్బందితో కలిసి మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
లాదెళ్ల, సింగరాజుపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు 100 గజాల లోపు ఉన్న కిరాణా షాపులపై దాడులు నిర్వహించి, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న నలుగురు యజమానులపై సీఓటీపీఏ-2003 చట్టం కింద కేసులు నమోదు చేశారు. 18 ఏళ్ల లోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం మరియు విద్యాసంస్థల సమీపంలో విక్రయాలు జరపడం చట్టరీత్యా నేరమని ఎస్సై స్పష్టం చేశారు. ఎవరైనా ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తూ కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థల వద్ద పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను అరికడతామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని దామెర ఎస్సై కొంక అశోక్ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.