
శాయంపేట సీఐ రంజిత్ రావు
వరంగల్ వాయిస్, దామెర : పొగాకు ఉత్పత్తుల విక్రయం, వినియోగంపై ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని శాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.రంజిత్ రావు హెచ్చరించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఓటీపీఏ-2003 చట్టం అమలుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలు, కళాశాలల చుట్టుపక్కల 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తులను విక్రయించడం నేరం. నిబంధనలు ఉల్లంఘించే దుకాణదారులపై కేసులు నమోదు చేసి, జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. 18 ఏళ్ల లోపు వయసున్న పిల్లలకు సిగరెట్లు లేదా ఇతర పొగాకు పదార్థాలను అమ్మడం చట్టరీత్యా విరుద్ధం. పబ్లిక్ ప్రదేశాల్లో ధూమపానం చేస్తూ ఇతరుల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే వారిపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేశామని, తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని తెలిపారు. పొగాకు వాడకం వల్ల కలిగే ఆరోగ్య నష్టాలను గమనించి, ప్రజలు ఇటువంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. “చట్టాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని సీఐ పి.రంజిత్ రావు కోరారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై భవిష్యత్తులో మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.