Warangalvoice

మీ ఆశీర్వాదం కావాలి | CM Revanth Reddy

  • నేనేమి మనులు, మాణిక్యాలు అడగడం లేదు
  • మేడారానికి జాతీయ హోదా కల్పించాలి
  • కిషన్ రెడ్డి, బండి సంజయ్ అందుకు కృషి చేయాలి
  • జాతర ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటుదాం..
  • వెయ్యేళ్లు శాశ్వతంగా ఉండేలా గ్రానైట్ తో నిర్మిద్దాం
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన


కోట్లాదిమంది భక్తులు దర్శించుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు కుంభమేళా తరహాలో జాతీయ హోదా కల్పించి అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. అందుకు రాష్ట్రం నుంచి ప్రాముఖ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృషి చేయాలన్నారు. పునర్నిర్మాణంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు మేడారం చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, పూజారులు సాంప్రదాయ నృత్యాలు, డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. సీఎం వెంట ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మహబూబాబాద్, వరంగల్ ఎంపీలు పొరిక బాలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ శబరిష్ తదితరులు పాల్గొన్నారు. తొలుత అమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన రేవంత్ అనంతర గద్దెల ప్రాంగణం ఆధునికీకరణకు రూపొందించిన డిజిటల్ మాస్టర్ ప్లాన్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటినుంచి మేడారం వస్తున్నట్లు వెల్లడించారు.
-వరంగల్ వాయిస్, ములుగు
 రెండేళ్ల ఒక్కసారి జరిగే మహా జాతరతో పాటు.. ఏడాది పొడుగునా మేడారంలో వనదేవతలైన సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకునేందుకు అనుగుణంగా మేడారం అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం శ్రీకారం చుట్టారు. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు మేడారం చేరుకున్న ముఖ్యమంత్రి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, పూజారులు సాంప్రదాయ నృత్యాలు, డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ఎంపీ పోరిక బలరాం నాయక్ మేడారం రావడంతో వారికీ రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క, వడ్లూరి లక్ష్మణ్, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఎస్పీ డాక్టర్ శబరీష్ స్వాగతం పలికారు. తొలుత ముఖ్యమంత్రి, మంత్రులు గద్దెల ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చిరే సారా సమర్పించారు. దీంతో పాటు తన ఎత్తు బంగారం అమ్మవార్లకు సమర్పించారు.
శాశ్వత ప్రాతిపదికన పనులు..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మేడారంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని, కేంద్ర ప్రభుత్వం కుంభమేళా తరహాలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసిందన్నారు. మేడారం కీర్తి ప్రపంచానికి చాటాలని, సమ్మక్క- సారలమ్మ వైభవం తరతరాలకు తెలిసే విధంగా అభివృద్ధి జరుగాలన్నారు. సమ్మక్క–సారలమ్మ గద్దెలు రాబోయే వందల సంవత్సరాలకు ఆదర్శంగా నిలవాలి అని, అందుకే ఈ ప్రాంగణంలో సిమెంట్ కట్టడాలకు బదులు రాతి కట్టడాలతో శాశ్వత నిర్మాణాలు చేపడతామని చెప్పారు. నాడు కాకతీయుల కాలంలో రుద్రదేవుడు కట్టించిన రామప్ప ఆలయం ఎనిమిది వందల సంవత్సరాలైనా నిలిచి ఉన్నట్టు ఇక్కడి నిర్మాణాలు వందల ఏళ్లు నిలవాలని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనులు 100 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించామని ఆయన వెల్లడించారు. జనవరి 28 నుండి 31 మధ్య జరిగే మహాజాతర నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మేడారం అభివృద్ధిలో ఆదివాసి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రణాళికలు ప్రభుత్వం చేస్తోంది కానీ సాంప్రదాయాలు ఆదివాసులవి అని, నిర్మాణం నుంచి సంరక్షణ వరకు ఆదివాసీల భాగస్వామ్యంతోనే కొనసాగిస్తాం అని సీఎం తెలిపారు. పరిశోధకులు, వారసులు, స్థానిక గిరిజన ప్రతినిధులు నిర్మాణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని కోరారు. జాతరను దేశంలోని కుంభమేళాల తరహాలో జాతీయ పండుగగా గుర్తించాలని, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఉత్తరప్రదేశ్ అయోధ్యకు లభిస్తున్న గుర్తింపు, సహకారం లాగే తెలంగాణ ములుగు అడవుల్లో ఉన్న సమ్మక్క-సారలమ్మ జాతర కూడా దేశ పండుగగా గుర్తింపును పొందాలి అని ఆయన విన్నవించారు. కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన పంచాయతీరాజ్ మంత్రి సీతక్క మాట్లాడుతూ సమ్మక్క–సారలమ్మ జాతరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు అని, ఆయన సంకల్పంతో ఈ ప్రాంతం శాశ్వతాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది అని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలతో మేడారం గద్దెల ప్రాంగణం కొత్త అందచందాలతో అలంకరించబడనుందని, రాబోయే జాతర నాటికి యావత్ దేశం, ప్రపంచం నుంచి వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎంపీలు బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య,ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి,నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, రాష్ట్ర అయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
cm_revanthreddy_medaram_toor
నిలువెత్తు బంగారం..
మేడారం సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవార్లకు 68 కిలోల నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించారు. మేడారంలో సమ్మక్క- సారలమ్మ గద్దెల సమీపంలో సీఎం తన బరువు ఎత్తు బంగారం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రి సీతక్క మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ పూజారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమ్మవార్ల ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలు అందించారు.

cm_revanthreddy_medaram_toor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *