
- ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ రావు
వరంగల్ వాయిస్, క్రైం : ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లలో ఎలాంటి మార్పు చేసిన వాహనదారుడితో పాటు మెకానికిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వరంగల్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ రావు హెచ్చరించారు. మంగళవారం కేయూసీ జంక్షన్ ప్రాంతంలో పలు ద్విచక్రవాహన సైలెన్సర్లను రోడ్ రోలర్తో ధ్వంసం చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా గత మూడు నెలల కాలంలో ట్రై సిటీ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలు విరుద్ధంగా అధిక శబ్ధం వచ్చే సైలెన్సర్లు ఏర్పాటు చేసిన ద్విచక్రవాహనాలను గుర్తించి వాటి నుంచి మార్పు చేసిన సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించాడంతో పాటు వాహన దారులకు కౌన్సిలింగ్ నిర్వహించి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించారు. ట్రాఫిక్ పోలీసులు తొలగించిన 461 సైలెన్సర్లను మరోమారు వినియోగించకుండా రోడ్ రోలర్ సాయంతో ద్వంసం చేసారు. ధ్వంసం చేసిన సైలెన్సర్లలో హనుమకొండకు చెందినవి 275 కాగా కాజీపేట 111 వరంగల్ 75 ఉన్నాయి.
అనంతరం ట్రాఫిక్ అదనపు డీసీపీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరిత్యా నేరమన్నారు. శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజాఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికంగా శబ్దం చేసే ద్విచక్రవాహనలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. ద్విచక్ర వాహనదారులలు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వినియోగించుకోవాలన్నారు. అలాగే మెకానికులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ద్విచక్రవాహనదారులను ప్రోత్సహించవద్దనన్నారు. ఈ కార్యక్రమములోట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రాఫిక్ ఇన్స్స్పెక్టర్లు రామకృష్ణ, సీతారెడ్డి, వెంకన్నతో పాటు ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గోన్నారు.