
వరంగల్ వాయిస్, క్రైం :పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు పోలీస్ అధికారులు పారదర్శకంగా న్యాయం అందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ నల్లబెల్లి పోలీస్ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం నల్లబెల్లి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్కు స్టేషన్ పోలీస్ అధికారులు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసులు సీపీకి గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ పోలీస్ సిబ్బంది నిర్వహించిన పరేడ్ తో పాటు కిట్ ఆర్టికల్స్ తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్ స్టేషన్ రిసెప్షన్, సిసిటిఎన్ఎస్ విభాగాల పనీతీరును సంబంధిత పోలీస్ సిబ్బందిని సీపీ అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు సంబంధించి పోలీస్ కమిషనర్ క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అలాగే స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు, అనుమానితులు, కేడీ,డిసిలు, మిస్సింగ్, ఆస్తి నేరాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించిన పోలీస్ కమిషనర్ సిబ్బందిని శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని కలిగించడంతో పాటు, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలంటే ప్రతి పోలీస్ ఉద్యోగి నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతోపాటు, మర్యాదపూర్వకంగా వారి ఫిర్యాదులు ఆలకించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీపీ పేర్కొన్నారు.అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో సీపీ, డీసీపీ చేతుల మీదుగా మొక్కలను నాటారు.ఈ తనిఖీల్లో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, దుగ్గొండి సిఐ సాయి రమణ, నల్లబెల్లి, ఖానాపూర్ ఎస్.ఐలు గోవర్ధన్, రఘుపతి పాల్గోన్నారు.



