
- రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు
- వికాస్ హైస్కూల్లో ‘ఇంటాక్’ డ్రాయింగ్ పోటీలు
- ‘లైఫ్ ఆఫ్ ట్రీ’ అంశంపై విద్యార్థుల ప్రతిభ
- విజేతలకు బహుమతుల ప్రదానం
వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ రెడ్డి కాలనీలోని వికాస్ హైస్కూల్లో గురువారం ఇంటాక్ (INTACH) హనుమకొండ చాప్టర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు ఘనంగా నిర్వహించారు. “లైఫ్ ఆఫ్ ట్రీ” అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో నగరంలోని వివిధ పాఠశాలల నుంచి సుమారు 57 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ కుంచెతో అద్భుతమైన చిత్రాలను గీశారు. పోటీలలో ప్రతిభ కనబరిచిన కింది విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి ఆర్. సుస్మిత (9వ తరగతి, సెయింట్ జోసెఫ్ హైస్కూల్), ద్వితీయ బహుమతి ఈ.శ్రీ వైష్ణవి (7వ తరగతి, వికాస్ హైస్కూల్), తృతీయ బహుమతి జి.ధన్యశ్రీ (8వ తరగతి, మాస్టర్జీ హైస్కూల్, కిషన్ పుర),కన్సోలేషన్ బహుమతి జె.వరుణ్ (8వ తరగతి, సెయింట్ జోసెఫ్ హైస్కూల్) గెలుపొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిట్ వరంగల్ రిటైర్డ్ ప్రొఫెసర్, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు మాట్లాడుతూ.. కాకతీయుల పాలనలో వరంగల్ గడ్డ సాంస్కృతిక వైభవానికి నిలయంగా ఉండేదని గుర్తుచేశారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ చరిత్రను ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మరో అతిథి జె.శ్రీధర్ రావు మాట్లాడుతూ.. ఇంటాక్ ప్రతి ఏడాది ఫిబ్రవరిలో డ్రాయింగ్, జూలైలో క్విజ్ పోటీలు నిర్వహిస్తుందని, జాతీయ స్థాయి విజేతలకు ఢిల్లీ వంటి నగరాలను ఉచితంగా సందర్శించే అవకాశం కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వికాస్ హైస్కూల్ ప్రిన్సిపాల్ రాగి వాణి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కక్కెర్ల నాగరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.