Warangalvoice

గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి

  • ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్
    నాలుగు పుష్కర ఘాట్లను సిద్ధం చేస్తున్న అధికారులు

వరంగల్ వాయిస్, ములుగు/హైదరాబాద్: రాష్ట్రంలో జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. గోదావరి తీరం గల జిల్లాల కలెక్టర్లు, అధికారులతో కలిసి పుష్కర ఏర్పాట్లపై కీలక ఆదేశాలు జారీ చేశారు. పుష్కరాలకు అవసరమైన నిధులు, మౌలిక సదుపాయాలపై పూర్తి స్థాయి ప్రతిపాదనలు తక్షణమే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య శిబిరాలు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. నది తీరంలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ములుగు జిల్లా కలెక్టర్ జిల్లాలోని ఏర్పాట్లను వివరించారు. మంగపేట, ముళ్ళకట్ట, రామన్నగూడెం, అంకన్నగూడెం ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. భక్తులకు అవసరమైన మరుగుదొడ్లు, పార్కింగ్, ఇతర వసతుల కోసం పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో ములుగు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *