Warangalvoice

Watch it on YouTube.. Print fake notes

యూట్యూబ్ లో చూసి.. నకిలీ నోట్లు ముద్రించి

  • దొంగనోట్ల ముఠా అరెస్ట్
  • నిందితులంతా ఉమ్మడి జిల్లా వారే
  • వివరాలు వెల్లడించిన సీపీ తరుణ్ జోషి

వరంగల్ వాయిస్, క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యూట్యూబ్ సహాయంతో నకిలీ నోట్లను ముద్రించి వివిధ ప్రాంతాల్లో చలామణి చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రెండు వేల రూపాయల నోట్లు మూడు వందలు (ఆరులక్షలు), కలర్ ప్రింటర్, ఏడు సెల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు నకిలీ నోట్ల తయారీ అవసరమైన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన సయ్యద్ యాకుబ్ ఆలియాస్ షకీల్ (ప్రధాన నిందితుడు), న్యూరాయపురకు చెందిన యం.డి సమీర్ (ప్రస్తుతం పరారీలో వున్నాడు), పెద్దమ్మగడ్డకు చెందిన పేరాల అవినాష్, నర్సంపేటకు చెందిన కత్తి రమేష్, మచిలీబజార్ కు చెందిన యం.డి అక్రం ఆలీ, కాజీపేటకు చెందిన గడ్డం ప్రవీణ్, గుండ్ల రజనీ, కత్తి సునిత, కాపువాడకు చందిన సోహెల్ ఉన్నారు.
అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వివరాలు వెల్లడించారు.. సయ్యద్ యాకుబ్ అలియాస్ షకీల్, గడ్డం ప్రవీణ్, గుండా రజనీ గతంలో కిడ్నాప్ కేసులో రామగుండం సబ్ జైలులో శిక్ష అనుభవించే సమయంలో వీరికి దొంగ నోట్లు ముద్రించే ముఠా సభ్యులతో పరిచయం ఏర్పడి, వారి ద్వారా దొంగ నోట్ల ముద్రించి తీరును తెలుసుకున్నారు. జైలు నుంచి విడుదల అనంతరం నిందితులు సులభం డబ్బు సంపాదించాలనుకున్నారు. నేర చరిత్ర కలిగిన నిందితులతో కలిసి నోట్ల తయారీ శ్రీకారం చుట్టారు. తాము ముద్రించిన రెండు వేల నోటుపై ఎవరి అనుమానం కలగకుండా ఉండేందుకు గాను ఈ ముఠా యూట్యూబ్ అనుసరించడంతో పాటు ఒరిజినల్ రెండు వేల రూపాయ కాగితాన్ని పోలివుండే కాగితాలను ఈ ముఠా కొనుగోలు చేసి నకిలీ నోట్లును ముద్రించేవారు. నిందితులు ముద్రించిన నకిలీ నోట్లను రద్దీ వుండే వ్యాపార కూడళ్ళతో పాటు కిరాణం, బట్టలషాపు, మద్యం బెల్ట్ షాపు వద్దకు నకిలీ నోట్లను చలామణి చేసేవారు. శుక్రవారం ఉదయం ప్రధాన నిందితుడు మరో నిందితుడు అవినాష్ తో దొంగనోట్లను చలామణి చేసేందుకు ద్విచక్ర వాహనంపై సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుమల్ బార్ వద్దకు వచ్చినట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో నిందితులను అరెస్ట్ చేసి విచారించారు. వారు ఇచ్చిన సమాచారంతో మిగతా నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి నకిలీ నోట్ల స్వాధీనం చేసుకున్నారు.
ముఠాను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి, ఇన్ స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, నరేష్ కుమార్, ఎస్.ఐలు నిస్సారాషా, సుబేదారి ఎస్.ఐ రవికిరణ్, ఏఏఓ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుళ్ళు మాధవరెడ్డి, స్వర్ణలత కానిస్టేబుళ్లు సీపీ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *