- పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ : పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఇప్పటి వరకు కోర్టు నుంచి తమకు నోటీసులు రాలేదని ప్రతివాదుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ప్రతివాదుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శి సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. 22వ తేదీలోపు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
ఈ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయి మాట్లాడుతూ.. రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే దాకా..? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి..? ఎంత సమయం కావాలో చెప్పండి. ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అనే తీరు సరికాదు అని మండిపడ్డారు.
బీఆర్ఎస్ తరపున సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం వాదించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్కు ఫిర్యాదు చేశామన్నారు. ఆ తర్వాత హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ను డివిజన్ బెంచ్ రివర్స్ చేసింది. ఇప్పటికి ఏడాది పూర్తయింది. కావాలని ఆలస్యం చేస్తున్నారు అని సుందరం పేర్కొన్నారు.
