- దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ నందు 33వ రోజు మరో కార్మికుడి మృతదేహం ఆచూకీ లభ్యమైనది. టన్నెల్ నందు సహాయక చర్యలు కొనసాగిస్తున్న రెస్క్యూ సిబ్బందికి టిబిఎం మిషన్ కింద కన్వేయర్ బెల్టు డ్రమ్కు 40 మీటర్ల దూరంలో మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి.
వరంగల్ వాయిస్, అచ్చంపేట : దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ నందు 33వ రోజు మరో కార్మికుడి మృతదేహం ఆచూకీ లభ్యమైనది. టన్నెల్ నందు సహాయక చర్యలు కొనసాగిస్తున్న రెస్క్యూ సిబ్బందికి టిబిఎం మిషన్ కింద కన్వేయర్ బెల్టు డ్రమ్కు 40 మీటర్ల దూరంలో మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. టన్నెల్ నందు మినీ జెసిపి ద్వారా శిథిలాలు తొలగించడం, మట్టి బురదను బయటకు పంపడం సహాయక చర్యలు కొనసాగుతుండగా శిథిలాల కింద మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. అట్టి మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి ఉండడం, ఆ ప్రదేశం భరించలేని దుర్వాసన వస్తుండడంతో మిగిలిన ఆరుగురి మృతదేహాలు కూడా అదే ప్రదేశంలో ఉండే అవకాశం ఉంటుందని అనుమానిస్తున్నారు.
రెస్క్యూ బృందాలు దుర్వాసన వస్తుండడంతో స్ప్రే బాటిల్స్ తీసుకొని లోపలికి వెళ్లారు. మృతదేహాన్ని బయటకు తీయడానికి టిబిఎం మిషన్ పరికరాలు గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించడం, మృతదేహం చుట్టూ భారీగా పేరుకుపోయిన శకలాలు, మట్టి బురద తొలగించడం లాంటి సహాయక చర్యలు వేగవంతం చేసి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. మృతుడిని ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రాజెక్టు ఇంజినీర్ మనోజ్ కుమార్గా గుర్తించారు. అనంతరం డెడ్బాడీని పోస్టుమార్టం నిమిత్తం నాగర్కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శవపరీక్ష అనంతరం డెడ్బాడీని మనోజ్ కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
గత ఫిబ్రవరి 22న టన్నెల్ నందు ప్రమాదం జరుగగా ఎనిమిది మంది కార్మికులు, ఇంజనీర్లు, మిషన్ ఆపరేటర్లు చిక్కుకొని జలసమాధి అయ్యారు. వారికోసం కేంద్ర రాష్ట్ర సంస్థలకు చెందిన అనేక విభాగాల రెస్క్యూ సిబ్బంది రాత్రింబవళ్లు మూడు షిఫ్టులుగా అన్వేషణ చేస్తున్నారు. సహాయక చర్యలకు అనేక అడ్డంకులు వస్తున్న వాటిని అధిగమిస్తూ మృతదేహాల వెలికితీతకు శాయశక్తుల శ్రమిస్తున్నారు. 8 మందిలో 16వ రోజు గురుపత్ సింగ్ మృతదేహం లభ్యం కాగా బయటకు తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన ఏడుగురి కోసం అన్వేషణ కొనసాగుతుండగా ఈ రోజు రెండో కార్మికుడి మృతదేహం కనిపించింది. మిగిలిన ఆరుగురి మృతదేహాల ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
