- శాంతి భద్రతలు కాపాడటంలో రేవంత్ సర్కార్ ఘోర వైఫల్యం చెందిందని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : శాంతి భద్రతలు కాపాడటంలో రేవంత్ సర్కార్ ఘోర వైఫల్యం చెందిందని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
గత వారం రోజుల్లోనే నలుగురు మహిళలపై అత్యాచార ఘటనలు జరిగాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు. మేడ్చల్ ఎంఎంటీఎస్ మహిళా బోగిలో ఉన్నప్పటికీ మహిళపై అత్యాచారం జరిగింది. సంగారెడ్డి కందిలో భర్తను కట్టేసి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఓ గుడి దగ్గర మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. మార్చి 31న జర్మనీ మహిళపై పహాడీ షరీఫ్లో అత్యాచారం జరిగింది అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
స్వయంగా ముఖ్యమంత్రే హోం మంత్రిగా ఉన్నా ఇన్ని అత్యాచారాలు జరగడం ఏందీ? ఘోరమైన ఘటనలు జరుగుతున్నా రేవంత్ రెడ్డి వాటిపై కనీసం సమీక్షలు ఎందుకు పెట్టలేదు? రాష్ట్రంలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతుంటే, క్రైమ్ రేట్ పెరుగుతుంటే పోలీసులు మాత్రం తెలంగాణ భవన్ (బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం) చుట్టూ తిరుగుతున్నరు. బీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా సైనికులపై అక్రమ కేసులు పెట్టే పనిలో బిజీగా ఉన్నారు. నిన్న ఒక్కరోజే బీఆర్ఎస్ సోషల్ మీడియాపైన తెలంగాణ పోలీసులు 16 కేసులు నమోదు చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
