Places of Worship Act : ప్రార్థనా స్థలాల చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన మధ్యంతర పిటీషన్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పిటీషన్లకు ఓ పరిమితి ఉండాలని సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది. ఏప్రిల్లో ఈ కేసును మళ్లీ విచారించనున్నారు.
వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ: 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం(Places of Worship Act)పై ఇంకా పిల్స్ దాఖలు అవుతున్నాయి. ఆ చట్టాన్ని సవాల్ చేస్తూ కేసులు ఫైల్ చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మధ్యంతర అప్లికేషన్లు దాఖలు చేయడానికి ఓ పరిమితి ఉండాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం .. ప్రార్థన స్థలాల చట్టం అమలుపై వాదనలు చేపట్టింది. మధ్యంతర పిటీషన్లు ఎక్కువ కావడంతో ఇవాళ ఆ కేసును విచారణకు స్వీకరించలేమన్నారు. త్రిసభ్ ధర్మాసనం ముందు మరీ ఎక్కువ సంఖ్యలో పిటీషన్లు ఉన్నాయని, ఈ కేసును మళ్లీ ఏప్రిల్ మొదటి వారంలో విచారించనున్నట్లు సుప్రీం తెలిపింది. మధ్యంతర పిటీషన్లు వేయడానికి ఓ పరిమితి ఉండాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. ప్రార్థన స్థలాల చట్టంపై అనేక రాజకీయ పార్టీలు మధ్యంతర పిటీషన్లు దాఖలు చేశాయి. వాటిల్లో కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, జమాత్ ఉల్మా హింద్,ఎంఐఎం ఉన్నాయి. ఆ పార్టీలన్నీ ప్రార్థనా స్థలాల చట్టాన్ని సమర్ధించాయి. ఆ చట్టాన్ని సవాల్ చేస్తున్న పిటీషన్లు ఈ పార్టీలు వ్యతిరేకించాయి. గత విచారణ సమయంలోనూ అనేక పిటీషన్లకు అనుమతి ఇచ్చినట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది. మధ్యంతర పిటీషన్లకు అనుమతి ఇవ్వరాదు అంటూ సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే తెలిపారు. ఒకవేళ కొత్త అంశాన్ని ప్రశ్నిస్తే మాత్రమే, కొత్త పిటీషన్లు స్వీకరించాలని సుప్రీం తెలిపింది.
