ఆలయాల్లో భక్తుల రద్దీ
పుట్టలో పాలు పోసి మొక్కులు
చల్లంగా చూడాలని ‘నాగన్న’కు పూజలు
వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి: నాగుల పంచమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. భక్తి శ్రద్ధలతో పుట్టల్లో పాలు పోయడానికి భక్తులు క్యూ కట్టారు. ఆలయాలను సుందరంగా అలంకరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లోని పుట్టలకు, నాగమయ్యను పూజించడానికి భక్తులు తరలివచ్చారు. అభిషేకాలు, పాలు, పండ్లు, పసుపు కుంకుమతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్, ఉర్సు నాగమయ్య గుడికి భక్తులు బారులు తీరారు. తమ కుటుంబాన్ని చల్లంగా చూడాలని నాగమయ్యను వేడుకున్నారు.
దయానంద కాలనీలో..
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని దయానంద కాలనీ శ్రీ కనకదుర్గ మాత దేవాలయం ఆవరణలోని నాగేంద్ర స్వామి దేవాలయంలో నాగుల పంచమి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గ మాత ఆలయ కమిటీ చైర్మన్ మీసాల ప్రకాష్ మాట్లాడుతూ.. శ్రావణ మంగళవారం నాగుల పంచమి రావడం విశేషమైన రోజు అన్నారు. ఉదయం ప్రాతక్కాల ప్రకారం మూడు గంటల 50 నిమిషాలకు శ్రీ వల్లి దేవసేన సైత సుబ్రహ్మణ్యస్వామి విగ్రహ ప్రతిష్ఠను ఆలయ అర్చకుడు గంప శ్రవణ్ కుమార్ చేశారన్నారు. నాగేంద్ర స్వామి ఆలయంలోని జువి చెట్టు కింద పుట్టలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పుట్టలో పాలు మొక్కులు సమర్పించుకున్నారన్నారు. కోరిన కోరికలు తీర్చే నాగేంద్ర స్వామిని మహిళా భక్తులు బారులు తీరి దర్శించుకున్నట్లు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొని నాగేంద్ర స్వామిని దర్శించుకున్నట్లు పేర్కొన్నారు.
