- MLC Kavitha | సుప్రీంకోర్టు తీర్పు వల్లే ఎస్సీ వర్గీకరణకు బాటలు పడ్డాయని, ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : సుప్రీంకోర్టు తీర్పు వల్లే ఎస్సీ వర్గీకరణకు బాటలు పడ్డాయని, ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత నివాసంలో దళిత బంధు సాధన సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదు. షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికను బయటపెట్టి.. వెంటనే వర్గీకరణ చేయాలి. దళితుల మధ్య పంచాయితీ పెట్టవద్దు… ఎవరికీ అన్యాయం జరగకుండా వర్గీకరణ ఉండాలి. ఎస్సీ వర్గీకరణ పేరు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మరో మోసం చేశారు. వర్గీకరణకు, ఉద్యోగాల కల్పనకు ముఖ్యమంత్రి లింక్ పెడుతున్నారు. వర్గీకరణ వంకతో జాబ్ క్యాలెండర్ అమలును నిలిపివేయవద్దు. కోర్టు తీర్పు వచ్చి 6 నెలలు గడిచినా ఆలూలేదు చూలు లేదన్నట్లుగా ఉందని కవిత విమర్శించారు.
రేవంత్ రెడ్డి మాటలు చెబితే నమ్మరని ఢిల్లీ నుంచి ప్రియాంగా గాంధీని తీసుకొచ్చి హామీ ఇప్పించారు. దళిత కుటుంబాలకు రూ. 10 లక్షలకు బదులు 12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. ముఖ్యమంత్రికి ప్రభుత్వాన్ని నడపడం చేతకావడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి కుదేలు చేశారు. ఇప్పటికే కేసీఆర్ మంజూరు చేసిన దళిత బంధు నిధులను విడుదల చేయాలి. ధైర్యం ఉంటే 18 వేల దళిత కుటుంబాలకు దళిత బంధు డబ్బులను డిమాండ్ చేయాలి. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందే ఈ డబ్బులు విడుదల చేయాలి. ఎస్సీలకు బడ్జెట్లో 33 వేల కోట్లు కేటాయించి… కేవలం 9800 కోట్లే ఖర్చు చేశారని కవిత తెలిపారు.
రేవంత్ రెడ్డిది మనసున్న ప్రభుత్వం కాదు.. మానవత్వం కూడా లేదు. రేవంత్ రెడ్డి ఆలోచన చిన్నది.. చూపు పెద్దవాళ్లపైనే ఉంది. అందుకే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పూలదండ కూడా వేయలేదు. అంబేద్కర్ను, ఆయన వారసులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారు. అంబేద్కర్ జయంతిలోపు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి కేబినెట్ మొత్తం వెళ్లి పూలదండలు వేయాలి. లేదంటే ప్రభుత్వం మూసివేసిన గేట్లను బద్దలుకొట్టి మేమే అంబేద్కర్ను గౌరవించుకుంటాం. అంబేద్కర్ని గౌరవించని ముఖ్యమంత్రి… మన ఆకలిని అర్థం చేసుకుంటారా..? అని కవిత ప్రశ్నించారు.
అట్టడుగు వర్గాల వారిని వేలు పట్టుకొని ముందుకు నడిపించాలన్నది కేసీఆర్ ఆలోచన. పేదలు, అణగారిన వర్గాల కోసం పనిచేయాలని కేసీఆర్ ఎప్పుడూ అంటున్నారు. దళితులను ధనవంతులను చేయాలన్న ఉద్ధేశంతో దళిత బంధును ప్రవేశపెట్టారు. ఎన్నికల కోసం… రానున్న తరాల కోసం కేసీఆర్ ఆలోచిస్తారు. అన్ని వర్గాలకు ఆత్మబంధువు అంబేద్కర్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైంది. అంబేద్కర్పై ప్రేమను ప్రదర్శించడానికి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అని కవిత పేర్కొన్నారు.
