- MLC Kavitha | నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా..? అని రేవంత్ రెడ్డి సర్కార్ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా..? అని రేవంత్ రెడ్డి సర్కార్ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఎన్నో మాయ మాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి మాత్రం ముందుకు రావడం లేదు. క్వింటాలు పసుపుకు రూ. 15 వేల మేర మద్దతు ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైంది? అని నిలదీశారు.
పసుపుకు కనీసం రూ. 9 వేలు రాని పరిస్థితి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇది రైతులను నయవంచన, మోసం చేయడమే అని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. పసుపు బోర్డు తీసుకొచ్చామని చెబుతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదు. పసుపుకు ధరలు పెంచుతామని, మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఇచ్చిన హామీ ఏమైంది..? తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 వేల మద్దతు ధర చెల్లిస్తూ పసుపు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
