- MLC Kavitha | బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో వేర్వేరుగా 46 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
వరంగల్ వాయిస్, నాగర్కర్నూల్ : బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో వేర్వేరుగా 46 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. అయితే ఈ మూడింటికి సంబంధించి వేర్వేరు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు కవిత. నాగర్కర్నూల్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో 46 శాతం రిజర్వేషన్లకు వేర్వేరు బిల్లులను పెట్టాలి. ఒకటే బిల్లు పెడితే మొదటికే మోసం వస్తుందని తొలి నుంచి నేను వాదిస్తున్నాను. ప్రభుత్వం దిగొచ్చి మూడు బిల్లులను పెట్టాలి. మూడింటికి ఒకే బిల్లు పెడితే కోర్టుల్లో నిలవదు అని కవిత పేర్కొన్నారు.
కాంగ్రెస్ చేపట్టిన కుల సర్వే తప్పుల తడఖగా ఉంది. 2014లో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో బీసీలు 52 శాతం ఉన్నట్లు తేలింది. ఇప్పుడు కాంగ్రెస్ చేసిన సర్వేలో 46 శాతం బీసీలు ఉన్నట్లు తేలింది. ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చిందో ప్రభుత్వం చెప్పాలి. కుల సర్వేపై ప్రభుత్వం విస్తృత ప్రచారం ఎందుకు కల్పించలేదు..? తప్పుడు లెక్కలతో బీసీల జనాభాను కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తుందని ధ్వజమెత్తారు.
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా బీసీ హక్కులకు రాజ్యాంగ రక్షణ రాకపోవడం బాధాకరం. చట్టసభల్లో బీసీలు ఎంత మంది ఉన్నారో చూస్తే పరిస్థితి అర్థమవుతోంది. బీసీలకు రాజ్యాంగ రక్షణ కల్పించి ఉంటే అభివృద్ధిలో ఇండియా అమెరికాను దాటిపోయేది. రాజ్యాంగ రక్షణ కలగాలంటే బీసీల కులాల జనాభాను లెక్కబెట్టడం అవసరం. దేశవ్యాప్తంగా జరిగే జనగణనలో బీసీ కులగణన జరగాలి అని కవిత డిమాండ్ చేశారు.
