వరంగల్ వాయిస్, దుండిగల్ : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు. ఇవాళ దుండిగల్ మున్సిపాలిటీ పరిధి గండి మైసమ్మలోని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఛలో వరంగల్ సభ సన్నాహక సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఛలో వరంగల్ సభ విజయవంతంపై ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతోపాటు అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని బంగారుమయంగా మార్చారని అన్నారు. స్వల్ప ఓటు శాతంతో మనం అధికారాన్ని కోల్పోయినా.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 16 నెలల్లో ప్రజలకు చేసింది ఏమి లేక రాజ్యాంగం ముసుగులో రాజకీయ పబ్బం గడుపుకుంటుందన్నారు. అసలు రాజ్యాంగంలో ఏమేమి ఉంటాయో తెలియని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు. ఇంతలా కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారే స్థాయికి చేరిందని మండిపడ్డారు.
చిత్తుచిత్తుగా ఓడిగోట్టేందుకు ప్రజలు సిద్ధం..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో ప్రజలు ఏం కోల్పోయారో వారికి అర్థమైందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడిగోట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఛలో వరంగల్ పేరుతో పార్టీ నిర్వహిస్తున్న 25వ రజోత్సవ వేడుకల కార్యక్రమానికి ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సులలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నుంచి ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెల్లి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పార్టీ పటిష్టత క్యాడర్ సత్తా అని తెలియజేయాలన్నారు.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను స్థానికంగా ఉండే ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ భారీ సంఖ్యలో బయలుదేరి వెళ్లాలన్నారు. పార్టీకి వెన్నెముకైన కార్యకర్తలు రాబోయే రోజుల్లో స్థానికంగా ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని, కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తల కోసం పార్టీ పనిచేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బంగారుమయంగా చేసిందని, 16 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలు చూశారని, భవిష్యత్తు అంతా మనదేనని అన్నారు.
అంతకముందు తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కార్పొరేషన్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీలకు ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, వివిధ డివిజన్ అధ్యక్షులు, పీఏసీఎస్ డైరెక్టర్లు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
