- KTR | రేవంత్ రెడ్డి ఇప్పటికీ 35 సార్లు ఢిల్లీ వెళ్లి చేసిందేమిటీ..? తాజాగా ఇవాళ 36వ సారి ఢిల్లీకి వెళ్లిండు.. ఇప్పుడు పీకేదేంటి..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
హైదరాబాద్ : అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి.. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో హస్తం నేతలు, కార్యకర్తలు చేరుతున్నారంటే రేవంత్ ప్రభుత్వం పతనానికి సంకేతం అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికీ 35 సార్లు ఢిల్లీ వెళ్లి చేసిందేమిటీ..? తాజాగా ఇవాళ 36వ సారి ఢిల్లీకి వెళ్లిండు.. ఇప్పుడు పీకేదేంటి..? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో స్టేషన్ ఘన్పూర్కు చెందిన మాజీ జడ్పిటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 15 నెలల కాలంలోనే అధికార పార్టీని వదిలిపెట్టి బీఆర్ఎస్లో చేరుతున్నారంటే.. ఆ పార్టీ పాలన ఏంటో అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజలకు విసుగు వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లోనూ పట్నం నరేందర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరారు. 15 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు కోపం వస్తుందని కేటీఆర్ తెలిపారు.
గత 48 గంటల్లో రాష్ట్రంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకో దిక్కు ఎస్ఎల్బీసీ వద్ద ప్రమాదం జరిగి 8 మంది కార్మికులు సొరంగంలో ఇరుక్కుపోయారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఆ ఎన్నికతో గవర్నమెంట్ మారేది లేదు.. ప్రభుత్వం తలకిందులు అయ్యేది లేదు. కానీ దాని కోసం హెలికాప్టర్లో పోయి మాట్లాడుతున్నాడని కేటీఆర్ ధ్వజమెత్తారు.
రైతు ఆత్మహత్యలు, కార్మికులు ఇరుక్కుపోతే సోయి లేకుండా గాల్లో చక్కర్లు కొడతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా 36వ సారి ఢిల్లీకి పోయిండు. ఏం పీకారు ఢిల్లీకి వెళ్లి. కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేకపోతున్నాడు. రాష్ట్రానికి హోం మంత్రి, విద్యాశాఖ మంత్రి, సంక్షేమ శాఖ మంత్రి లేడు. మంత్రులను నియమించుకోలేని అసమర్థ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను, ఆయన ఆనవాళ్లను మాయం చేస్తా అంటుండు. తెల్లారిలేస్తే కేసీఆర్ జపం చేయని రోజు ఉండదు. నిద్రలో కూడా కేసీఆరే యాదికి వస్తున్నట్లుంది. వాస్తవం ఏందంటే.. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు దగ్గరి దోస్తులకు ఇలా చెప్పుకున్నడంట.. మనం గెలుస్తలేం.. ప్రతిపక్షంలో ఉండి గట్టిగా కొట్లాడాలి.. కేసీఆర్ ఉన్నన్ని రోజుల గెలువం అని చెప్పుకున్నడట. కానీ ప్రజలు లక్కీలాటరీలో ఆయనను గెలిపించారని కేటీఆర్ తెలిపారు.
