Warangalvoice

Ktr Demands Inquiry Kancha Gachibowli Land Scam Issue

KTR | రేవంత్ రెడ్డి లాంటి పిచ్చి సన్నాసి తప్ప.. చెరువును ఎవడూ తాకట్టు పెట్టడు: కేటీఆర్‌

వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : రేవంత్ చేసిన 10 వేల కుంభకోణం మీద తాము చెప్పిందే నిజమైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  అన్నారు. హెచ్‌సీయూ భూములపై రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని వారం రోజుల క్రితమే చెప్పామన్నారు. సుప్రీంకోర్టు సాధికార కమిటీ హెచ్‌సీయూ భూములపై ఆర్థిక పరమైన అవకతవకలు, ఉద్దేశపూర్వకంగా చేసిన అరాచక పర్వంపై స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. ఈ రూ.10 వేల కోట్ల కుంభకోణం బయటకు రావాలంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆర్బీఐ కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ‘బుధవారం నాటి సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా ఉన్నాయి. అధికార మదంతో విర్రవీగుతూ.. మేమే నియంతలం, రారాజులం అని అనుకుంటున్న వారికి నిన్నటి సుప్రీం కోర్టు తీర్పు ఒక గుణ పాఠం. సుప్రీంకోర్టు ఆదేశాలతో వేరే ముఖ్యమంత్రి అయితే రాజీనామా చేసేవాడు. కానీ రేవంత్‌ రెడ్డికి సిగ్గు లేదు కాబట్టి దులుపుకొని పోతున్నడు. హెచ్‌సీయూ భూముల కోసం పోరాడిన విద్యార్థులు, సామాజికవేత్తలకు అభినందనలు. సెంట్రల్‌ ఎంపవర్డ్ కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు. కంచగచ్చిబౌలి భూమి వర్సిటీ ఆధీనంలో ఉన్నదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సాధికార కమిటీ చెప్పింది. ఆ భూములపై సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలని సూచించింది.

10 వేల కోట్ల కుంభకోణం బయటకు రావాలంటే పూర్తిస్థాయి విచారణ జరగాలి. ప్రధాని మోదీ ఒక్కోచోట ఒక్కోరకంగా మాట్లాడుతారు. రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ నడుస్తున్నదని అన్నారు. కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. సెంట్రల్‌ వర్సిటీ భూముల్లోకి ప్రభుత్వం బుల్డోజర్లను పంపి విధ్వంసం సృష్టిస్తున్నదని మోదీ చెప్పారు. హెచ్‌సీయూ భూములపై రేవంత్ రెడ్డి చేసిన కుంభకోణంపై మోడీ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు?. సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ హెచ్‌సీయూ భూములపై కుంభకోణం జరిగిందని, విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని నిన్న నివేదిక ఇచ్చింది. ఈ కుంభకోణంపై మా పార్టీ తరపున అన్ని ఆధారాలతో సహా లేఖ రాశాం. మోదీకి చిత్తశుద్ధి ఉంటే ఈ కుంభకోణంపై విచారణకు ఆదేశించాలి. లేదంటే మోడీ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని మేమే కాదు తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటారు. కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి. ప్రభుత్వ ఉత్తర్వులను టీజీఐఐసీ తుంగలో తొక్కిందని సాధికార కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చెరువలను కూడా తనఖా పెట్టారని నివేదికలో పేర్కొంది. రేవంత్ రెడ్డి లాంటి పిచ్చి సన్నాసి తప్ప చెరువును ఎవడు తాకట్టు పెట్టడు. రేవంత్‌ ప్రభుత్వాన్ని కాపాడేందుకు బీజేపీ నేతలు ఎందుకు ప్రయత్నిస్తున్నారని’ ప్రశ్నించారు.

వన్యప్రాణులు చనిపోయాయంటే ఏఐ వీడియోలంటూ కేసులు పెట్టారు. రేవంత్‌రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు, పోలీసుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం. కంచ గచ్చిబౌలి భూములపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం. ఆర్థిక దోపిడీ, పర్యావరణపై దాడి విషయంలో ప్రధాని మోదీ స్పందించాలి. చిత్తశుద్ధి ఉంటే రేవంత్‌ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడాలి.

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి వ్యాఖ్యలపై ‘రేవంత్ రెడ్డి ఐదేండ్లు అధికారంలో ఉండాలి. ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని కూలగొట్టే కర్మ మాకు లేదు. ప్రజలకు కోపం వస్తే బంగ్లాదేశ్‌లో లాగా వాళ్లే రోడ్డెక్కి ప్రభుత్వాన్ని తొక్కుతారు. పెద్ద పెద్ద నియంతలే కొట్టుకుపోయారు.. రేవంత్ రెడ్డి ఎంత?. ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం. మా దగ్గర కూడా ప్రజలు వచ్చి ప్రభుత్వాన్ని కూల్చేయాలని చెప్తున్నారు. కానీ ఈ ఐదేండ్లు రేవంత్ రెడ్డే అధికారంలో ఉండాలి. అప్పుడే ఇంకో 20 ఏండ్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలంటే భయపడతారు. ఫార్ములా-ఈ కేసులో మంత్రిగా విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు తాను ఎప్పుడూ అధికారులను బలిపశువులను చేయలేదు. రాజకీయం అంటే అట్ల చేయాలి.. అంతే కానీ మంచి జరిగితే నాది చెడు జరిగితే అధికారుల మీద నెట్టే కుసంస్కారం మా పార్టీకి లేదు’ అని కేటీఆర్‌ అన్నారు.

Ktr Demands Inquiry Kancha Gachibowli Land Scam Issue
Ktr Demands Inquiry Kancha Gachibowli Land Scam Issue

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *