వరంగల్ వాయిస్, హైదరాబాద్ : నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను దొంగే అంటారు.. దొంగను దొంగలాగే చూస్తారు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచేలా మాట్లాడిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
వ్యక్తిగతంగా ఎన్ని దూషణాలు, తిట్లైనా తింటాం.. అవమానాలు సహిస్తాం కానీ గత ఏడాదిన్నర కాలంగా మమ్మల్ని నోటికొచ్చిన బూతులు మాట్లాడినా చివరికి మా నాయకుడి చావును కోరుకుంటూ నికృష్టపు రోత మాటలు మాట్లాడినా మేం భరించాం. సహించాం. కోపాన్ని పంటి బిగువును దాచుకున్నాం. మమ్మల్ని ఎన్ని తిట్టినా పడుతాం కానీ.. వేల మంది త్యాగాలతో, దశాబ్దాల పోరాటల ఫలితంగా.. టీఎన్జీవోలు, బుద్దిజీవుల నేతృత్వంలో రాజకీయ నాయకులు మేల్కొక ముందే.. విద్యార్థి సంఘాలు, కేసీఆర్ పోరాటం చేసి చివరకు తెలంగాణ సాధించారు. ఈ రాష్ట్ర భవిష్యత్కు ఒక శాపం పెట్టే విధంగా నిన్న సీఎం మాట్లాడిన దారుణమైన మాటలు ఎవైతే ఉన్నాయో.. వాటిపై కచ్చితంగా మాట్లాడాలని కేసీఆర్ ఆదేశించారని కేటీఆర్ తెలిపారు.
కేసీఆర్ చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమని ఇవాళ రుజువైంది..
నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తుంటే.. అత్యంత అసమర్థుడు, చేతగానివాడు, పనికిరాని దక్షత లేని పాలకుడు ఈదేశంలో ఇంకొకరు లేరని తేలిపోయింది. 420 హామీలతో అభయహస్తం పేరుతో ఇచ్చిన మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం అని తేలిపోయింది. ఢిల్లీ పార్టీలను నమ్మితే 60 ఏండ్ల గోసపడ్డాం.. మళ్లీ ఆ పార్టీలను నమ్మితే మోసపోతాం అని చెప్పారు. ఆనాడు ఎన్నికల సమయంలో ఢిల్లీ పార్టీలన నమ్మితే ఆగమైతది అని కేసీఆర్ చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమని ఇవాళ రుజువైంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవాళ తెలంగాణ చేతికి చిప్ప వచ్చే పరిస్థితి..
నన్నెవరూ నమ్ముతలేరు, అప్పు పుడతలేదు.. అపాయింట్మెంట్ దొరకట్లేదు. దొంగను చూసినట్టు చూస్తున్నారు.. అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంత దివాళ కోరుమాటలు ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు. నాకు పరిపాలన చేత కాదు అని రేవంత్ రెడ్డి చేతులెత్తేశారు. దొంగను దొంగలాగానే చూస్తారు. నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను దొంగే అంటారు. మోసగాళ్లను దొంగలే అంటారు. దొంగ చేతికి కాంగ్రెస్ పార్టీ తాళాలు ఇచ్చింది. సరిగ్గా మూడేండ్ల క్రితం రాహుల్ గాంధీ వరంగల్కు వచ్చి రైతు డిక్లరేషన్ పేరిట 2 లక్షల రుణమాఫీ, రైతుబంధు కింద రూ. 15 వేలకు పెంపు, కౌలురైతులకు రైతుబంధు, రైతుకూలీలకు న్యాయం చేస్తామని వ్యవసాయ డిక్లరేషన్లో చెప్పి మూడేండ్లు దాటింది. కానీ ఏ ఒక్కటి పూర్తిస్థాయిలో అమలు కాలేదు. తప్పు చేసింది రాహుల్ గాంధీ.. దొంగచేతికి తాళాలు ఇచ్చి ఇవాళ తెలంగాణ చేతికి చిప్ప వచ్చే పరిస్థితి చేసింది రాహుల్ గాంధీనే. ఇందుకు ఆయనే బాధ్యుడు అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఎందుకు ఈ ఫ్రస్టేషన్..?
ఎందుకు ఈ ఫ్రస్టేషన్ అని మా నాయకులంతా కలిసి మాట్లాడుకుంటూ వచ్చాం.. అధికారంలోకి వస్తామని వారు అనుకోలేదు. అడ్డగోలు హామీలు ఇచ్చారు.. ఇవాళ ఏం చేయాలో తెలుస్తలేదు. మొత్తం నాశనం చేశారు. దొంగ ఇవాళ ప్రజల నుంచి తప్పించుకోవడానికి మార్గాలను వెతుకుతూ ఆ పద్ధతుల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్లు కనిపిస్తోందని కేటీఆర్ అన్నారు.
