- KTR | ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంపై జ్యుడిషీయల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంపై జ్యుడిషీయల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒకవైపు సహాయక చర్యలను మరింత వేగవంతంగా కొనసాగిస్తూనే జరిగిన ప్రమాదంపైన అందుకు బాధ్యులైన వారిపైన విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజా ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదం వల్ల ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరిగింది. ఇంతకు ముందు సుంకిశాల, పెద్దవాగు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేయలేదు, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ప్రమాదాలపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ కమీషన్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యమంత్రి సహా, అనేక అంశాలపై న్యాయ కమీషన్ల ఏర్పాటు కోసం డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక న్యాయ కమీషన్లు ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు.
తాజా ప్రమాదాలపై న్యాయ కమీషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని మేము మా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఆర్మీ, ఇతర సంస్థల సహాయంతోఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెంటనే వెనక్కి తీసుకువచ్చేలా ప్రభుత్వం మరింతగా కృషి చేయాలని కేటీఆర్ పేర్కొన్నారు.
