- రాష్ట్రంలో ఉప్పు – నిప్పులాగా కొట్లాడుకుంటాం.. కానీ చెన్నైలో సీఎం రేవంత్ రెడ్డిని గౌరవించానని, అది నా సంస్కారం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉప్పు – నిప్పులాగా కొట్లాడుకుంటాం.. కానీ చెన్నైలో సీఎం రేవంత్ రెడ్డిని గౌరవించానని, అది నా సంస్కారం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. శాసనసభలో కేటీఆర్ మాట్లాడారు.
రేవంత్ రెడ్డి గారికి ఒక్కటి చెప్పదలచుకున్నా.. మీరు నేను చెన్నై మీటింగ్కు వెళ్లాం. అక్కడ మీరు ఒక ప్రతిపాదన పెట్టారు. నేను మీ పార్టీ వ్యక్తిని కాదు.. ఇక్కడ ఉప్పు నిప్పులాగా కొట్లాడుకుంటాం.. కానీ నేను మిమ్మల్ని గౌరవించి.. మా సీఎం చెప్పిన మాట కరెక్ట్ అని 33 శాతం కాదు 36 శాతం ఇవ్వొచ్చని చెప్పాను. ఎందుకంటే నాకు ఆ సంస్కారం ఉంది. ఎందుకంటే నీవు మా ముఖ్యమంత్రివి కాబట్టి.. హద్దులు, సరిహద్దులు దాటిన తర్వాత నిన్ను కాపాడాలి.. నిన్ను గౌరవించాలి.. అది నా బాధ్యత అని కేటీఆర్ తెలిపారు.
ఇక్కడ సభలో అంత ఫ్రస్టేషన్ ఉంటే కుదరదు. రంకెలు వేస్తామంటే కుదరదు. ప్రతిపక్షాల మీద మాటలతోని డైలాగులతో దాడి చేస్తా అంటే కుదరదు. పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు. పరిపాలన అంటే మీరు చెప్పిన కష్టాలన్నీ ఉంటాయి. 2014లో కూడా కష్టాలతోనే ప్రారంభించాం. అన్ని సెట్ చేసుకుంటూ ఇక్కడి దాకా వచ్చాం.. ఐ విష్ యూ ద బెస్ట్ అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ పేర్కొన్నారు.
కక్ష సాధింపు లేదని రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి ఎందుకు బీఆర్ఎస్ పథకాలు, ప్రాజెక్టులు రద్దు చేశారు. అప్పటికే ఎయిర్పోర్టు మెట్రో టెండర్ అయిపోయింది. కానీ కోపంతో రద్దు చేశారు. ఫార్మా సిటీలు వద్దన్నారు.. ఫార్మా విలేజ్లు ముద్దన్నారు. ఏమైంది..? కొడంగల్లో ఏం జరిగింది. ఈ విషయంలో సీఎంది తప్పు కాదు.. బిజీగా ఉంటారు. లగచర్లలో ఫార్మా విలేజ్ పెట్టాలనుకున్నప్పుడు మీ సోదరుడితోనో.. మీ నాయకులతో మాట్లాడి ఒప్పించి ఉండాల్సిండే. లగచర్ల రైతుల ధర్నాలు, రాస్తారోకోలు పట్టించుకోలేదు. ఆఖరికి అధికారులు పోతే లొల్లి యింది. దాన్ని మాకు అంటగడితే ఎలా..? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు.
