రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి. సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పాలన చేతగాని అసమర్థ సీఎం రేవంత్ అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) వ్యాఖ్యానించారు. ఒక్క క్షణం కూడా సీఎంగా ఉండే అర్హత ఆయనకు లేదన్నారు. వెంటనే రాజీనామా చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
‘మొదటి నుంచి బీఆర్ఎస్ చెప్తున్న మాటలు నేడు నిజమని తేలిపోయాయి. ఓనమాలు రాని వాడు పదో తరగతి చదివనట్లుంది రేవంత్ తీరు. తెలంగాణ ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఢోకా లేదు. రేవంత్కి పరిపాలన చేతకావట్లేదనేది ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. అప్పులతో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ రెండున్నర లక్షల కోట్ల ఆదాయానికి తెచ్చారు. రాష్ట్ర ఆదాయం తగ్గి మంత్రుల ఆదాయం పెరగడంతోనే అసలు సమస్య వస్తోంది. మాఫియాలా రాష్ట్ర ఆదాయం లూటీ చేసి ఢిల్లీకి మూటలు మోస్తున్నారు. సీఎం పదవికి లంచాల కోసం మంత్రులు పోటీ పడి సంపాదిస్తున్నారు. హామీలు ఎగ్గొట్టడం కోసమే రేవంత్ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. నిన్న రేవంత్ మాట్లాడిన మాటల్లో ప్రతి అక్షరం అబద్ధమే.
ఎన్నికల ముందు ప్రజలని రెచ్చగొట్టి హామీలిచ్చి నేడు చేతులెత్తేస్తున్నారు. మాది వందేళ్ళ చరిత్ర , అపార పరిపాలనా అనుభవం ఉందని కోసిన కోతలు ఏమయ్యాయి..? రేవంత్ రెడ్డిలా కేసీఆర్ బాధ్యతారాహిత్యమైన హామీలు ఇవ్వలేదు. ఆదాయ వ్యయాలు తెలుసు కాబట్టే కేసీఆర్ రేవంత్లా ఎక్కువిస్తామని చెప్పలేదు. అధికారం కోసం ప్రజలకు హామీలిచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నారు. తెలంగాణ తెచ్చిన వాళ్ళం కాబట్టే మోసపూరిత హామీలు మేము ఇవ్వలేదు. అప్పే అవసరంలేదన్న రేవంత్ ఇప్పుడు ఎందుకు కాళ్ళరిగేలా తిరుగుతున్నాడు. ఒక్క సంవత్సరం మంత్రులు కడుపుకట్టుకుంటే అన్ని హామీలు అమలయ్యేవి. రేవంత్ దొంగ చరిత్ర చూసి అందరు ఆయన్ని చెప్పులెత్తుకెళ్లే వాడిలా చూస్తున్నారు. తెలంగాణ పరువు బజార్లో పెడుతున్న రేవంత్.. 420 హామీలిచ్చామని చెంపలేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని జగదీష్ రెడ్డి అన్నారు.
