HarishRao:రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఫుడ్ పాయిజన్ కేసులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హరీష్రావు డిమాండ్ చేశారు.
వరంగల్ వాయిస్ హైదరాబాద్: గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు బాధాకరమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి, విద్యార్థులు ఆస్పత్రి పాలు కావడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని చెప్పారు. సామాజిక మాధ్యమం ఎక్స్లో రేవంత్ ప్రభుత్వంపై హరీష్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఒకటి కాదు రెండు కాదు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు వందల్లో నమోదయ్యాయని అన్నారు. వందల మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కాగా, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ ఆహారం విద్యార్థులకు పెడితే అరెస్టులు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారని గుర్తుచేశారు.అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా గురుకులాల తీరు ఉందని విమర్శించారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప కూడా దాటదు అనేందుకు గురుకులాల దీన స్థితే నిదర్శనమని అన్నారు. ఆస్పత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఫుడ్ పాయిజన్ కేసులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హరీష్రావు డిమాండ్ చేశారు.
