- Harish Rao | ఏడాది కిందటి వరకు శాంతియుతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హింస, నేరాలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ఏడాది కిందటి వరకు శాంతియుతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హింస, నేరాలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్యనాయక్ తండాలో తాజాగా బీఆర్ఎస్ కేడర్పై జరిగిన దాడే దీనికి నిదర్శనమని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులను ఉసిగొల్పుతూ నిజంగానే మార్పు తెచ్చారు. కాంగ్రెస్ మార్క్ ఎమర్జెన్సీని ఆ పార్టీ కొల్లాపూర్లో అమలు చేయిస్తోంది. సాతాపూర్లో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై దాడి జరిగి ఒక రోజు గడవక ముందే నార్యానాయక్ తండాలో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు గర్హనీయం అని హరీశ్రావు పేర్కొన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరుల దాడులు పెరిగిపోతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రచారం చేసుకునే హక్కు ప్రతిపార్టీకి ఉంటుంది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడం ప్రతిపక్షాల కర్తవ్యం. బీఆర్ఎస్ ఈ పనులు చేస్తుంటే కాంగ్రెస్కు జీర్ణం కావడం లేదు. తమ వైఫల్యాలు ప్రజలకు తెలిస్తాయని భయపడుతూ దాడులుకు పాల్పడుతున్నది. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ. ఇలాంటి ఎన్నో అణచివేతలను ఎదుర్కొని నిలిచింది. దాడులకు, కేసులకు మా కార్యకర్తలు భయపడరు. బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుంది. పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకుని తమ కర్తవ్యం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాను అని హరీశ్రావు తెలిపారు.
