- Harish Rao | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విరుచుకుపడ్డారు. అబద్దాలకు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ రెడ్డి అని హరీశ్రావు ధ్వజమెత్తారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విరుచుకుపడ్డారు. అబద్దాలకు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ రెడ్డి అని హరీశ్రావు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో అవే అబద్దాలు, బయట అవే అబద్దాలు చెబుతున్నాడని మండిపడ్డారు.
13 రోజులు గడుస్తున్నా వైద్యారోగ్య శాఖలోని టీవీవీపీ విభాగంలో ఉన్న 13వేల మందికి జీతాలు చెల్లించనిది వాస్తవం కాదా? డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నది మీ కళ్లకు కనిపించడం లేదా? ఆరోగ్య శాఖలోనే కాదు, పోలీసు శాఖలోనూ ఇదే దుస్థితి. పెంచిన జీతాలు, అలవెన్సుల మాట దేవుడెరుగు, ఉన్న జీతాలు ఇప్పటికీ రాక హోంగార్డులు ఆవేదన చెందుతున్నది నిజం కాదా? అని హరీశ్రావు ప్రశ్నించారు.
ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామనే అబద్దాన్ని, అవకాశం ఉన్న చోటల్లా ప్రచారం చేసుకునే మీకు.. వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాల ఆవేదన అర్థం కావడం లేదా? దుష్ర్పచారంతోనే ఏడాదిన్నర గడిపారు. ఇంకెంత కాలం వెళ్లదీస్తారు.? టీవీవీపీ డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది సహా, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులకు వెంటనే వేతనాలు విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీశ్రావు పేర్కొన్నారు.
