వరంగల్ వాయిస్, హైదరాబాద్ : హత్యా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకే అలవాటు.. బీఆర్ఎస్ పార్టీ హత్యా రాజకీయాలను ప్రోత్సహించదు అని మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో గండ్రా వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
భూపాలపల్లిలో రాజలింగ మూర్తి హత్యను బీఆర్ఎస్ మాజీ శాసన సభ్యుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. హత్య తర్వాత కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతోంది. ఈ హత్యను బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, హరీశ్రావుకు ఆపాదించాలని కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నించడం దుర్మార్గం. స్థానిక భూవివాదం నేపథ్యంలో ఈ హత్య జరిగిందని ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కొందరి ఒత్తిడితో రాజలింగ మూర్తి భార్య నాపై ఆరోపణలు చేస్తున్నారు అని వెంకట రమణారెడ్డి తెలిపారు.
ఈ హత్యపై సీబీఐ, సీఐడీ విచారణను కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ఎలాంటి విచారణ చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. మేడిగడ్డపై రాజలింగమూర్తి కోర్టులో కేసు వేశారు. దాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటున్నాం. మృతుడిపై భూ వివాదాల ఆరోపణలు ఉన్నాయి.. రౌడీ షీట్ కూడా ఉంది. బీఆర్ఎస్పై, నాపై ఆరోపణలు చేయడం ద్వారా విచారణను ప్రభావితం చేయడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. హత్యలో అరెస్టయిన వ్యక్తుల పేర్లతో రాజలింగ మూర్తి పోలీసులకు పిర్యాదు కూడా చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డికి మతి భ్రమించింది. బట్ట గాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు అని మాజీ ఎమ్మెల్యే ధ్వజమెత్తారు.
హత్యారాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి అలవాటు.. బీఆర్ఎస్ హత్యారాజకీయాలను ప్రోత్సహించదు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై కూడా కోమటిరెడ్డి నల్లగొండ మున్సిపల్ చైర్మన్ను హత్య చేశారని ఆరోపించారు. వేముల వీరేశం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కోమటిరెడ్డి పూటకో మాట మాట్లాడతారు.. ఆయన నోటికి మొక్కాలి. పోలీసులు నిస్పాక్షిక విచారణ జరిపి దోషులకు కఠిన శిక్షలు పడేలా చేయాలి. కాంగ్రెస్ నేతలు కుటిల రాజకీయాలు మానుకుంటే మంచిది అని గండ్రా వెంకటరమణా రెడ్డి హెచ్చరించారు.
