వరంగల్ వాయిస్, దిల్సుఖ్నగర్ : దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో గతంలో ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పునే తెలంగాణ హైకోర్టు ఖరారు చేసింది. పేలుళ్ల కేసులో దోషులుగా ఉన్న ఆ ఐదుగురికి ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను సమర్థించింది. బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన ఐదుగురికి ఎన్ఐఏ కోర్టు 2016లో ఉరిశిక్ష విధించింది. ఆ శిక్షను రద్దు చేయాలని కోరుతూ దోషులు తెలంగాణ హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు.
దోషుల అప్పీల్ పిటిషన్పై ఇప్పటికే విచారణ జరిపిన హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. దోషుల పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు తెలిపింది. కాగా దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ బస్టాప్లో, మిర్చిపాయింట్ వద్ద జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మరణించారు. 131 మంది గాయపడ్డారు. ఐదుగురు నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు చెప్పింది.
ఐదుగురు ముద్దాయిలు ఈ తీర్పును రద్దు చేయాలని హైకోర్టులో అప్పీలు చేశారు. ఇటీవల విచారణ పూర్తి చేసిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ పీ శ్రీసుధతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు చెప్పింది. అయితే ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు.
