BRS MLC Kavitha: రేవంత్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేసులకు భయపడొద్దు, ప్రజాక్షేత్రం లో పోరాడుతూనే ఉందామని అన్నారు.
వరంగల్ వాయిస్, ఖమ్మం జిల్లా: రేవంత్ ప్రభుత్వానికి పరిపాలించడం చేతకాక అక్రమ కేసులు పెడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు. ఖమ్మంలో కవిత ఇవాళ(శనివారం) పర్యటించారు. ఖమ్మం సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న లక్కినేని సురేందర్ను పరామర్శించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. లక్కినేని సురేందర్ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కట్టడి చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.
రేవంత్వి అన్నీ దొంగ మాటలే..
బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తే కేసీఆర్ను అడ్డుకున్నట్లేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుబంధు, రైతు భీమా , ఫించన్, ఉద్యోగాలు రాలేదని మండిపడ్డారు. రేవంత్వి అన్నీ దొంగ మాటలేనని విమర్శించారు. 14 నెలల కాంగ్రెస్ పాలనలో దొంగహామీలే తప్ప చేసింది ఏం లేదని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తామని అన్నారు. రేవంత్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేలే అని హెచ్చరించారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా కల్పించారు. కేసులకు భయపడొద్దు, ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే ఉందామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
రైతుల సమస్యలను పరిష్కరించాలి..
కాగా అంతకుముందు ఖమ్మం వెళ్తున్న ఎమ్మెల్సీ కవితకు చౌటుప్పల్లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ ప్రాంత త్రిబుల్ ఆర్ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని కవిత అన్నారు. త్రిబుల్ ఆర్ రైతులకు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా ఉంటానని చెప్పి.. అధికారంలోకి రాగానే రేవంత్ మాట మరిచారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతున్నా త్రిబుల్ ఆర్ రైతుల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి త్రిబుల్ ఆర్ బాధితుల విషయంలో చొరవ తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.
