సీనియర్ జర్నలిస్టు, హనుమకొండ : తెలంగాణలో నైజాం విముక్తి కోసం జరిగిన పోరాటానికి గుర్తుగాసెప్టెంబర్ 17ను ముమ్మాటికీ విలీన దినోత్సవంగానే గుర్తించాలి. నిజాం రాజుతో పాటు ఆయన సంస్థానంలోని భూస్వాములకు వ్యతిరేకంగా హిందూ, ముస్లింలు ఐక్యంగా పోరాటాలు చేశారు. కానీ బీజేపీ నేతలు హైదరాబాద్ సంస్థానంలోని విముక్తి పోరాటాన్ని ముస్లింలకు వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సెప్టెంబర్17పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షోయబుల్లాఖాన్ ముస్లిం అయినప్పటికీ రజాకార్లు ఆయన చేతులు నరికారు. వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మతపరమైన కోణంలో ఎలా చూస్తాం. సాయుధ రైతాంగ పోరాటం విజయవంతమయ్యే దశకు చేరుకున్నంక ‘‘చుట్టుముట్టూ సూర్యాపేట.. నట్టనడుమ నల్లగొండ.. గోల్కొండ ఖిల్లా కింద నీ ఘోరీ కడుతం కొడుకో.. నైజాం సర్కరోడా’’ అని తెలంగాణ ప్రజలు పాటలు పాడుకునే వారు. నిజాంకు ప్రజలు ఘోరీ కట్టేందుకు సిద్ధమైన తర్వాతే సర్దార్ పటేల్ సైన్యం ప్రవేశించడం, నిజాం లొంగిపోవడం, అదే నిజాంను రాజ్ ప్రముఖ్గా నియమించడం జరిగాయి. తెలంగాణలోని భూస్వాములు మళ్లీ భూములను స్వాధీనం చేసుకుంటే వాటిని దక్కించుకోవడానికి పోరాడిన ప్రజలను భారత సైన్యం మట్టుబెట్టాయి. ఇండియన్ యూనియన్లో విలీనం కోసం నిజాం, భూస్వాముల నిరంకుశత్వం నుంచి విముక్తి కోసం పోరాడిన ప్రజలపై భారత సైన్యం తుపాకులు ఎక్కుపెట్టి నాలుగు వేల మందిని చంపాయి. ఈ ఉద్యమాన్ని హిందూ – ముస్లిం గొడవగా చూపించడం ఏమాత్రం సరికాదు. దీనికి వక్రభాష్యాలు పలికి కొత్త వివాదాలకు తావివ్వకూడదు.
-తెలంగాణ ప్రాంతం ఇండియాలో విలీనమైనరోజు
చరిత్రలో సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన రోజు. తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా నిజాం నవాబు హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది. అంతకు ముందు నిజాం సర్కారుతో యథాతథ ఒప్పందం చేసుకున్న సర్దార్ పటేల్, నెహ్రూ ప్రభుత్వం కూడా నిజాం సర్కార్ కూలిపోయే దశలోనే సైన్యాన్ని పంపించింది. సాయుధ పోరాటంతో కూలిపోయిందనే వాతావరణం రాకుండా ఉండేందుకు కావాలనే సైన్యాన్ని పంపించింది. ఆచరణలో నిజాం రాజును రక్షించింది. తెలంగాణ ప్రజలు ఏ రాజుపై పోరాటం చేశారో..అదే నిజాంను రాజప్రముఖ్గా నియమించింది. పటేల్ సైన్యం రాకపోతే, సాయుధ పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రజలు నిజాం రాజును, ఖాసీం రజ్వీని ప్రజాకోర్టులో శిక్షించేవారు. దున్నేవాడికే భూమి ఇచ్చేవారు. కానీ పటేల్, నెహ్రూ సైన్యాలు పేద రైతుల నుంచి భూములు గుంజుకొని మళ్లీ భూస్వాములకు ఇచ్చాయి. నిజాం రాజును, ఖాసీంరజ్వీని రక్షించాయి.
– కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన సుమారు10 లక్షల ఎకరాల భూములను దొరలు, దేశ్ ముఖ్ లు, నిజాం నుంచి స్వాధీనం చేసుకున్నారు. మూడు వేల గ్రామాల విముక్తి జరిగి నాలుగున్నర వేల మంది అమరులయ్యారు. కానీ యూనియన్ సైన్యం వచ్చినంకనే పేదలు ఆక్రమించుకున్న ఆ భూములు తిరిగి భూస్వాములకే దక్కాయి. సర్ఫేకాస్, పైగా, వక్ఫ్ ల్యాండ్, ల్యాండ్ సీలింగ్ పేరిట ప్రభుత్వాలు పేదల దగ్గరి నుంచి లక్షలాది ఎకరాల భూములను లాక్కున్నాయి. నిజంగా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే పేదల నుంచి స్వాధీనం చేసుకున్న భూములన్నింటినీ తిరిగి వారికే పంచాలి. నరహంతక కాశీం రజ్వీ చేతుల్లో చనిపోయినవారి కుటుంబాలను ఈ 75 ఏండ్లలో ప్రభుత్వాలు ఆదుకోలేదు. కానీ ఇవేమి పట్టించుకోకుండా, ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చకుండా ఈ రోజు పార్టీలు విమోచనం అని, విలీనం అని, జాతీయ సమైక్యత అని, నేడు ప్రజాపాలన అని కొత్త రాగం అందుకుంటున్నాయి. ఏడో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ను రక్షించేందుకే ఆపరేషన్ పోలో పేరిట యూనియన్ సైన్యాలు వచ్చాయి. సంస్థానం విలీనం తర్వాత నిజాం చేసిన నేరాలపై ఎలాంటి విచారణ జరగలేదు. నిజాంను సురక్షితంగా తరలించడానికే ఆపరేషన్ పోలో ఉపయోగపడింది. కాంగ్రెస్, కమ్యూనిస్టు కార్యకర్తలంతా ఉద్యమంలో పాల్గొన్నారు. దాన్ని కమ్యూనిస్టులకే పరిమితం చేయడం సరికాదు.
-అమరుల త్యాగాలదినం ఇది
మనిషికి అత్యంత విలువైనది ప్రాణం. ఒక ఆశయం కోసం ఆ ప్రాణాన్ని త్యాగం చేయడమే అమరత్వం. తెలంగాణ అంటే కోట్లాది ప్రజల భూమి సమస్య. భూమిని దొరలు, దేశ్ ముఖ్ లు, దోపిడీదారుల నుంచి విముక్తి చేయడానికే ఉద్యమాలు వచ్చినయి. అందుకే నేను రాసిన పొడుస్తున్న పొద్దు పాటలో ‘‘మా భూములు మాకేనని మర్లవడ్డ గానమా.. తిరగబడ్డ రాగమా/రాచరికం కత్తి మీద నెత్తుర్లా గాయమా../దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా’’ అని రాసిన. అమరుల త్యాగాలు ఇంకా ఫలించలేదు. సెప్టెంబర్17ను అమరుల త్యాగాలదినంగా ప్రకటిస్తున్న. తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి మొదలైన త్యాగాల పరంపర.. కొనసాగుతూనే ఉన్నాయి అమరుల ఆశయాలు ఇంకా ఫలించలేదు. ఫలించేవరకు పోరాటాలు కొనసాగుతూనే ఉంటయి.
-సెప్టెంబర్17తోనే అంతా ముగియలేదు..
హైదరాబాద్ సంస్థానం సెప్టెంబర్17న ఇండియన్ యూనియన్ లో కలిసింది. ఇది వాస్తవం. దీన్ని బీజీపీ విమోచన దినంగా పరిగణించాలంటున్నది. ముస్లిం రాజు నుంచి హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్ లో కలవడం ఒక ఎత్తయితే.. హైదరాబాద్ స్టేట్ లో ఉండే ప్రజలకు ఇది విలీనమే అని చూడాలి. ఆదివాసీలు, దళితులకు ఉండే హక్కులు, పురుషాధిక్యత తొలగి మహిళలకు సమాన అవకాశాలు, ప్రాంతీయ ఆధిపత్యం లేని సమాజం నిర్మాణం జరిగినప్పుడే విమోచనం జరిగినట్లు. కానీ కేవలం ఒక ముస్లిం రాజు లొంగిపోవడాన్ని విమోచన అనడం సరికాదు. తెలంగాణ విలీనం తర్వాత కూడా రెండుసార్లు సీమాంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేశారు. అలాగే గ్రామాల్లో పేదలు, దళితులు, ఆదివాసీలు ఇంకా తమ స్వేచ్ఛ కోసం పోరాడుతూనే ఉన్నారు. కాబట్టి సెప్టెంబర్ 17న జరిగింది విమోచనం అనడానికి లేదు. నిజానికి ఆ రోజు త్యాగాలు చేసింది కమ్యూనిస్టులు. రజాకార్ల అరాచకత్వాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కొన్నారు. కానీ ఆ పోరాటాన్ని వారు ఓన్ చేసుకోలేకపోతున్నారు. రజాకార్లను పూర్తిగా అణచివేయడానికి యూనియన్ సైన్యాలు పని చేశాయి. కానీ అదే విమోచనం కాదు. ఇండియన్ యూనియన్ లో విలీనం తర్వాత కూడా హైదరాబాద్ స్టేట్ కు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. భూసంస్కరణలను అమలు చేయలేదు. ఆ రోజు ప్రజలు ఏ ఆశయాల కోసం పని చేశారో వాటిని నెరవేర్చలేదు. జరగాల్సిన మార్పు చాలా ఉంది. సెప్టెంబర్17తోనే అంతా ముగిసింది అనుకోవడం చరిత్రను పక్కదారి పట్టించినట్లే అవుతుంది.
– తోట సుధాకర