- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ నగరం మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయ సమావేశ మందిరంలో కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారులతోపాటు పలు శాఖల అధికారులతో వరంగల్ నగర అభివృద్ధిపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ నగరం తర్వాత వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి పరచడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు పలు మార్లు సమావేశాలు నిర్వహించి సూచనలు అందించామని తెలిపారు. గతంలో ఉన్న 2041 మాస్టర్ ప్లాన్ ను 2050 నాటి జనాభాను దృష్టిలో ఉంచుకొని పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతి పాదించాలని సూచించారు. ఇందుకు అవసరమైన భూముల సేకరణ చేపట్టాలన్నారు. ఇప్పటికే కన్సల్టెంట్లు తయారు చేసిన మాస్టర్ ప్లాన్ లను మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించి, పలు సూచనలు అందించారు. ఈ సమావేశంలో మున్సిపల్ పరిపాలన ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, బల్దియా కమిషనర్, కుడా వైస్ చైర్మన్ అశ్విని తానాజీ వాకడే, సీడీఎంఏ గౌతమ్, రోడ్లు భవనాలు శాఖ కార్యదర్శి హరిచందన, కుడా సీపీఓ అజిత్ రెడ్డి, కాన్సల్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.