సుప్రీం కేసు నేపథ్యంలో లోక్సభ దిద్దుబాటు చర్య వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: లక్షద్వీప్ ఎంపీ, ఎన్సీపీ సీనియర్ నేత మహ్మద్ ఫైజల్ లోక్సభ సభ్యత్వం విషయంలో.. లోక్సభ సెక్రటేరియెట్ వెనక్కి తగ్గింది. వెంటనే అతని ఓలక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించింది. సుప్రీం కోర్టులో బుధవారం వాదనలు జరగడానికి కొన్ని గంటల ముందే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫైజపై అనర్హత వేటు ఎత్తేస్తున్నట్లు, లక్షద్వీప్ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు లోక్సభ ప్రకటించింది. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియెట్ జనరల్ పేరిట ఓ నోటిఫికేషన్ను విడుదల చేసింది. 2016, జనవరి 5వ తేదీన ఫైజల్పై అండ్రోథ్ పోలీస్ స్టేషన్లో ఓ హత్యాయత్నం కేసు నమోదైంది. ఆ కేసు కొనసాగుతుండగానే.. 2019లో ఆయన లోక్సభ ఎంపీగా నెగ్గారు. అయితే.. ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఫైజల్తో పాటు మరో ముగ్గురికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. దీంతో జనవరి 13వ తేదీన లోక్సభ సచివాలయం ఫైజల్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ.. అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన కోర్టుకు ఆశ్రయించగా.. నిర్దోషిగా కేరళ కోర్టు తేలుస్తూ… సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని ఆదేశించింది. కానీ, లోక్సభ సెక్రటేరియట్ అనర్హత వేటు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మార్చి 29వ తేదీన ఫైజల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరగనున్న నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటును లోక్ సభ ఎత్తివేసింది. గతంలో కావరాతి కోర్టు తీర్పు నేపథ్యంలో ఫైజల్ను ఎంపీ పదవి నుంచి తొలగిస్తూ లోక్సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ చర్య ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొంటూ ఫైజల్ లోక్సభ కార్యదర్శిపై కోర్టు ధిక్కార పిటిషన్ను దాఖలు చేశారు. విచారణ పెండిరగ్లో ఉండగానే ఎంపీ అనర్హత వేటును ఉపసంహరించు కుంటూ లోక్సభ ఉత్తర్వులు జారీ చేసింది.కేరళ హైకోర్టు పైజల్ నేరం, శిక్ష పై స్టే విధించినా అనర్హత నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోని లోక్ సభ సచివాలయం వైఖరిపై ఫైజల్ సుప్రీంను ఆశ్రయించారు. పైజల్ పిటీషన్ ను సీజేఐ డివై చంద్రచూడ్ విచారణకు స్వీకరించిన నేపథ్యంలో లోక్ సభ సచివాలయం పైజల్ అనర్హతపై దిగొచ్చి, అనర్హత నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడడంతో.. ఫైజల్ కేసులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి, ఇవి రాహుల్ కేసులోనూ వర్తించే అవకాశాలున్నాయన్న చర్చ నడుస్తోంది.