- పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వాలి
- ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాచర్ల బాలరాజు
వరంగల్ వాయిస్, వరంగల్ : అఖిలభారత రైతుకూలీ సంఘం నర్సంపేట డివిజన్ కార్యవర్గ సమావేశం బుధవారం సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షుడు గట్టి కృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాచర్ల బాలరాజు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోటే రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామని చెప్పి ఆచరించలేకపోయింది. పైగా, ఆగస్టు 15లోపు అమలు చేస్తామని ప్రకటించింది. కానీ, ఇప్పటికే రైతులు అప్పుల బారిన పడి బ్యాంకులిచ్చిన రుణాలకు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో గత 40 సంవత్సరాలుగా గిరిజన గిరిజన పేదలు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారని వారికి శాశ్వత పట్టాలు లేకపోవడం వల్ల ప్రతి ఖరీఫ్ సీజన్లో ఫారెస్ట్ అధికారులు దాడులు చేసి పంటలను ధ్వంసం చేస్తున్నారని, అలా జరగకుండా వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పట్టాలివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు పంట నష్టపోతే వారికి 2005 యాజమాన్య హక్కు చట్ట ప్రకారం నష్టపరిహారం అందాల్సి ఉండగా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, ఇప్పటికైనా పూర్తి నష్టపరిహారం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అలాగే, పంటల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ఆయన కోరారు. ఇందులో గత మోడీ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలను చెప్పించి వారికి లాభాలు అందే విధంగా విధానాలు తయారు చేసిందని, ఇకముందు అలా జరగకుండా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామాలలో అసంబద్ధంగా కొనసాగుతున్నదని కూలీలకు ఒక రోజుకు రూ.125లను మాత్రమే అందుతున్నదని వారికి పనిచేసే ప్రాంతంలో తగిన సౌకర్యాలు ఉండడం లేదని, రోజుకు రూ.600 చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, సంవత్సరానికి 150 నుంచి 200 రోజులు పని కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం డివిజన్ కార్యదర్శి జక్కుల తిరుపతి, సభ్యులు గుగులోతు భద్రాజి, మల్లయ్య, వీరారెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
