- ఏకాగ్రతతో చదివి కొలువు కొట్టండి
- ఆత్మన్యూనతా భావాన్ని దరిచేరనివ్వొద్దు
- చదువుపైనే దృష్టి సారించండి.. అనవసర విషయాల్ని పట్టించుకోవద్దు
- ఇంటర్వ్యూ విధానం రద్దుతో అపోహలకు చెక్
- ప్రభుత్వ ఉద్యోగం సాధించి బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకోండి
- ఫ్రీ కోచింగ్ అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి మార్గనిర్ధేశనం
వరంగల్ వాయిస్, నిజామాబాద్: ‘‘మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని, దానిని ఎలా నిర్దేశించుకోవాలన్నది మీ పైనే ఆధారపడి ఉంటుంది’’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి స్పష్టం చేశారు. ఏకాగ్రతతో చదువుతూ, పక్కా ప్రణాళికతో సన్నద్ధమైతే కోరుకున్న ప్రభుత్వ కొలువును దక్కించుకోవడం కష్టమైన పనేమీ కాదన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పోలీస్ ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఫ్రీ కోచింగ్ అందిస్తున్న నేపథ్యంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కె.వి.నాగరాజుతో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి మంగళవారం మార్గదర్శనం చేశారు. వేదిక పై నుంచి దిగి అభ్యర్థుల మధ్యకు వచ్చి తనదైన శైలిలో కీలక సూచనలు చేస్తూ వారిలో స్ఫూర్తిని పెంపొందింపజేశారు. ఉద్యోగ సాధనకు పాటించాల్సిన పద్ధతులు, సన్నద్ధత తీరు గురించి అన్ని అంశాలను మేళవిస్తూ, ఎంతో అర్ధవంతంగా ఆకట్టుకునే రీతిలో విడమర్చి చెప్పడం అభ్యర్థుల్లో ఆత్మస్థైర్యాన్ని ఇనుమడిరపజేసింది. ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో తెలుగు మాధ్యమంలోనే తాను చదువుకుని కోరుకున్న సివిల్ సర్వీస్ ఉద్యోగాన్ని సాధించానంటూ తన స్వీయానుభవాన్ని అభ్యర్థులకు చెప్పి వారిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. నిరాశ, నిస్పృహలను దరిచేరనివ్వకుండా, తాము ఎలాగైనా సాధిస్తానని గట్టి సంకల్పంతో కష్టపడితే ఆశించిన లక్ష్యం దానంతట అదే వరిస్తుందని పార్థసారథి సూచించారు. మొహమాటం, బద్ధకం, వాయిదా వేయడం వంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ, మానసిక ఒత్తిడిని జయిస్తూ ముందుకు సాగాలని హితవు పలికారు. ప్రస్తుతం ప్రభుత్వం పెద్దఎత్తున చేపడుతున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో యువత కోరుకున్న కొలువులు దక్కించుకుని బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయడంతో అనవసర అపోహలకు ఆస్కారం లేకుండా పోయిందన్నారు. ఇదివరకటితో పోలిస్తే అభ్యర్థులకు అనేక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని జిల్లాకు అత్యధిక కొలువులు దక్కేలా కృషి చేయాలని సూచించారు. ఫ్రీ కోచింగ్ తో ఇప్పటికే యాభై శాతం విజయం సాధించగలిగారని, ఇంకాస్త గట్టిగా కష్టపడితే జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వ అధికారి హోదాను అనుభవిస్తూ ప్రజలకు సేవ చేస్తూ ఆత్మ సంతృప్తిని పొందే అవకాశం కేవలం ప్రభుత్వ ఉద్యోగం ద్వారానే లభిస్తుందన్నారు. పోటీ పరీక్షలకు సంబంధించి పరీక్షా విధానంలో, సిలబస్ లో పెద్దగా తేడా ఉండదని, విషయ పరిజ్ఞానం, అవగాహన ముఖ్యమని సూచించారు. ఎన్ని గంటల పాటు చదివామని కాకుండా, ఎంత ఏకాగ్రతతో చదివాం.. చదివిన అంశాలను పరీక్షలో ఎలా రాశాం అన్నదే అభ్యర్థుల విజయావకాశాలను నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరిలో శక్తి సామర్థ్యాలు నెలకొని ఉంటాయని, తమపై తాము గట్టి నమ్మకంతో కష్టపడే వారే విజేతలు అవుతారని చెప్పారు. నేర్చుకుంటున్న అంశాలను ఎప్పటికప్పుడు పునఃశ్చరణ చేసుకుంటూ, ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవాలని సూచించారు. పోటీ పరీక్షల సన్నద్ధత వన్ డే మ్యాచ్ కాదని, దీనిని టెస్ట్ మ్యాచ్ గా భావిస్తూ, నిలకడ, ఏకాగ్రతతో లక్ష్యాన్ని ఛేదించాలని పేర్కొన్నారు. చిన్న చిన్న అవరోధాలను, అపజయాలను చూసి కుంగిపోకూడదని, వాటిని విజయానికి మెట్లుగా వాడుకోవాలని హితవు పలికారు. మన చేతుల్లో లేని విషయాల గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేయడం కంటే, మనం చేయాల్సిన కర్తవ్యాన్ని పూర్తి స్థాయిలో నిర్వర్తించడంపైనే దృష్టిని కేంద్రీకరించాలని హితబోధ చేశారు. కాగా, జిల్లాలో ఫ్రీ కోచింగ్ కోసం చేసిన ఏర్పాట్లు, అభ్యర్థులకు అందిస్తున్న శిక్షణ, వసతి సౌకర్యాలు వంటి విషయాల గురించి కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు అరవింద్ బాబు, ఉషా విశ్వనాథ్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు శశికళ, నాగోరావ్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.






