- తాళం వేసిన రెండు ఇళ్లల్లో చోరీ
- భారీగా నగదు, బంగారం అపహరణ
వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : దొంగలు తాళం వేసి ఉన్న రెండు ఇళ్ల తాళాలు పగల గొట్టి నగదు, ఆభరణాలు చోరీకి పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రామచంద్రాపురం కాలనీలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న బానోత్ వెంకటేశ్వర్లు-అనిత దంపతులు తమ స్వగ్రామం రెడ్డిగూడెంలో రైస్ మిల్లు నిర్మాణం చేపట్టేందుకు రూ.4 లక్షల 70 వేలు అప్పుగా తెచ్చి ఇంట్లోని డ్రెస్సింగ్ టేబుల్ లో దాచి పెట్టారు. రాత్రి హాస్పిటల్ లో విధులు నిర్వహించేందుకు దంపతులు ఇంటికి తాళం వేసి వెళ్లారు. విధులు ముగించుకొని మరుసటి రోజు ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంటికి వేసిన తాళం పగలగొట్టి కనిపించింది. ఇంట్లోకి వెళ్లి చూడగా డ్రెస్సింగ్ టేబుల్ లో దాచి ఉంచిన రూ.4లక్షల 70 వేలు చోరీకి గురయ్యాయని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ట్రాన్స్ కోలో పని చేస్తున్న మహమ్మద్ ఖదీర్ బంధువుల ఇంట్లో వేడుకకు మరో గ్రామానికి వెళ్ళి తిరిగి వచ్చే సరికి దొంగలు ఇంటి తాళం పగుల గొట్టి బీరువాలో దాచిన తులం బంగారు, 12 తులాల వెండి ఆభరణాలు, రూ.4 వేలు నగదు చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు క్లూస్ టీమ్ తో సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పట్టణంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పట్టణంలో గస్తీని ముమ్మరం చేసి దొంగల బారీ నుంచి రక్షించాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు.
