ఈ పార్లమెంట్ సమావేశంలో బీసీల కుల గణన చేపట్టాలి
బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించండి
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్
వరంగల్ వాయిస్, హనుమకొండ : బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో బీఎంఎస్ కార్యాలయంలో బీసీల చలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ బీసీ కుల గణన లేకుంటే బీసీల అస్తిత్వం కష్టమేనని, బీసీలకు ప్రస్తుతం అందుతున్న ఫలాలు కొనసాగాలంటే, జనాభా దామాష ప్రకారం బీసీల వాటా బీసీలకు దక్కాలంటే బీసీ లెక్కలు తప్పనిసరిగా ఉండాల్సిందేనని అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశంలో బీసీ కుల గణపైన పార్లమెంట్ లో చట్టం చేయాలని, జనాభాలో 55 శాతం ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో రిజర్వేషన్ కల్పించాలని, బీసీల పైన క్రిమిలేయార్ ఎత్తివేయాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అగస్టు 7న తల్కటోర స్టేడియంలో అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆగస్టు 8న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నుంచి పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం 29 రాష్ట్రాల నుంచి వస్తున్న వేలాది మంది బీసీ కార్యకర్తలతో చేపట్టనట్లు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీసీ నాయకులు, బీసీ యువకులు, బీసీ మహిళలు, బీసీ విద్యార్థులు ఈ కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాడి మల్లయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి జనగాం శ్రీనివాస్, బీసీ విద్యార్థి సంఘం కాకతీయ యూనివర్సిటీ ఇంఛార్జి నాగరాజ్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బండి రఘుపతి గౌడ్, బీసీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు బోడిగే వసంత, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కోడం సాయికుమార్, బీసీ సంక్షేమ సంఘం మంథని నియోజకవర్గ ఇంఛార్జి దుర్కి కుమార్ యాదవ్, గారపల్లి ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.