కలెక్టర్ సిక్తా పట్నాయక్
వరంగల్ వాయిస్, హనుమకొండ : ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లాలో వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారం, వసంతపూర్ గ్రామాల్లో ఓరుగల్లు డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తుండగా శనివారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు వచ్చిన ధాన్యం, తూకం వేసిన ధాన్యం తరలింపు, తదితర వివరాలతో పాటు తేమశాతం ఎంత తీస్తున్నారనే వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇంకా ఎంత ధాన్యాన్ని తూకాలు వేయాల్సి ఉందని కలెక్టర్ ఆడిగారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఈ నెలాఖరు నాటికి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అందుబాటులో టార్పాలిన్ కవర్లు ఉంచాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధిత మిల్లులకు వెంటనే తరలించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా కో-ఆపరేటివ్ అధికారి విజయ భాస్కర్ రెడ్డి, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థులకు సకాలంలో యూనిఫాంలను అందించాలి..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు స్కూల్ యూనిఫాంలను సకాలంలో కుట్టి అందించేందుకు బాధ్యత తీసుకున్న మహిళా సంఘాలు కృషి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలను కుడుతున్న కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్ని యూనిఫాంలను కుట్టారనే వివరాలను బాధ్యత తీసుకున్న మహిళా సంఘాల నిర్వాహకులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల పున ప్రారంభం సమీపిస్తున్న నేపథ్యంలో స్కూల్ యూనిఫాంలను సకాలంలో అందించాలన్నారు.
