- ఇద్దరు యువకుల దుర్మరణం
వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : వేగంతో వస్తూ అదుపు తప్పిన కారు.. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే దుర్మరణం చెందిన విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి గ్రామ శివారులో సోమవారం చోటు చేసుకుంది. గూడూరు మండలం పోనుగోడు గ్రామానికి చెందిన సంగెం మణికంఠ (17), నీల అరుణ్ కుమార్ (16) ప్రాణస్నేహితులు. మణికంఠ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జ్యోతి బా ఫూలే కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూ దసరా సెలవులకు ఇంటికి వచ్చి తిరిగి కళాశాలకు తన స్నేహితుడు నీల అరుణ్ కుమార్ తో కలసి ద్విచక్ర వాహనంపై వెలుతున్నాడు. దీంతో మార్గం మధ్యలో జమాండ్లపల్లి సమీపంలోకి చేరుకోగానే మహబూబాబాద్ నుంచి నర్సంపేటకు వైపు అతివేగంతో వెళ్తూ అదుపు తప్పిన కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న అరుణ్…మణికంఠలు 50 మీటర్ల దూరం ఎగిరి పడి అక్కడిక్కడే మృతి చెందారు. అరుణ్ హైదరాబాదులోని చైతన్య కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అరుణ్, మణికంఠలు గ్రామంలో కలసి తిరిగిన కొద్ది సేపటికే రహదారి ప్రమాదంలో విగిత జీవులుగా పడి ఉండడం చూసి బంధువులు,గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకే రోజు రహదారి ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.