- ఘనంగా విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు
- ముఖ్య అతిథిగా హాజరైన పి.ప్రావీణ్య
వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ బాలసముద్రంలోని కాళోజి కళాక్షేత్రం ఆడిటోరియంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని గురువారం రాత్రి సంగీత, నృత్య కార్యక్రమాల్ని నిర్వహించారు. త్యాగరాజ ఆరాధన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ముఖ్య అతిథిగా పాల్గొని హైదరాబాద్ నుంచి వచ్చిన కళాకారులతో పాటు స్థానిక కళాకారులు, కళాశాల అధ్యాపక బృందంతో కలిసి త్యాగరాజ కీర్తనను ఆలపించారు. స్థానిక కళాకారులతో పాటు హైదరాబాద్ కు చెందిన కళాకారులు త్యాగరాజ కీర్తనలను ఆలపించి సంగీత అభిమానులను అలరింపజేశారు. విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న కళాకారులందరికీ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అభినందనలు తెలియజేశారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, కళాకారులందరికీ స్వర్ణోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ నాడ్గౌడ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కళాశాల అధ్యాపకులు భాస్కర్, అనుముల యోష, హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓని విజయ్ తదితరులతోపాటు కళాకారులు, సంగీత అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.