మూడు రోజుల పాటు వివిధ సేవల నిలిపివేత వరంగల్ వాయిస్,తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి ఈ నెల 5 వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 5 వరకూ స్వామివారికి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం , సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున సోమవారం ఉదయం 7 గంటలకు శ్రీదేవి సమేతంగా శ్రీమలయప్ప స్వామి వారుని ఆలయ నాలుగు మాడ వీధిలో ఊరేగించారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు. వసంతోత్సవ అభిషేక నివేదన పూర్తయిన తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు స్వప్న తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనే, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలో ఘనంగా ఆస్థానం నిర్వహించనున్నారు. చివరిరోజైన ఏప్రిల్ 5న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ’వసంతోత్సవ’మని పేరు ఏర్పడిరది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం వసంతోత్సవంలో ప్రధాన పక్రియని అధికారులు వెల్లడిరచారు.