చట్టంపై గౌరవంతోనే కవిత విచారణకు హాజరు: ఎంపి రంజిత్ రెడ్డి వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విచారణ సాగుతోంది. ఇడి విచారణకు ఎమ్మెల్సీ, కెసిఆర్ కూతురు కవిత సోమవారం ఉదయం హాజరయ్యారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడైన అభిషేక్ బోయినపల్లికి మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు నిరాకరించింది. ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరవుతారా లేదా అన్న అనుమానాలు వచ్చినా..చివరకు హాజరయ్యారు. ఈ నెల 20న హాజు కావాలని ఇచ్చిన నోటీసులతో ఆమె హాజరయ్యారు. దీంతో ఆమెను అధికారులు విచారిస్తున్నారు ఈడీ అధికారులు. ప్రధానంగా 100 కోట్ల రూపాయల లావాదేవీలపైనే ప్రశ్నలు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో.. సౌత్ గ్రూప్ పాత్ర ఏంటీ.. ఆ లావాదేవీలు ఎలా జరిగాయి.. ఎవరెవరు ఆ డబ్బులను సమకూర్చారు.. సౌత్ గ్రూపులో విూ పాత్ర ఏంటీ అంటూ ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న ఆప్ లీడర్ మనీష్ సిసోడియా, రామచంద్ర పిళ్లయ్ ఇచ్చిన సమాచారంతోపాటు రిమాండ్ రిపోర్టులో వాళ్లిద్దరూ చెప్పిన సమాచారం ఆధారంగా కవితను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. పిళ్లయ్తో కలిపి కవితను.. ఫేస్ టూ ఫేస్ విచారిస్తున్నారు. ఆప్ పార్టీకి ఇచ్చిన డబ్బు విషయంలోనే ప్రధానంగా విచారణ జరుగుతున్నట్లు తెలుస్తుంది. బ్యాంక్ స్టేట్ మెంట్స్, ఇతర డాక్యుమెంట్లపై ఆరాతీస్తున్నారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడైన అభిషేక్ బోయినపల్లికి మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడి.. జైల్లో ఉన్న అభిషేక్ బోయినపల్లి మధ్యంతర బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేసిన న్యాయస్థానం.. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 12వ తేదీకి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అభిషేక్ బోయినపల్లి.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. పిల్లల స్కూల్ అడ్మిషన్ కోసం హాజరుకావాల్సి ఉందని.. బెయిల్ ఇవ్వాలని కోరారు ఆయన. స్కూల్ లో పిల్లల అడ్మిషన్ కోసం నేరుగా హాజరుకావాల్సి ఉందని.. వారి భవిష్యత్, చదువులను దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో అభిషేక్ బోయినపల్లి కోరారు. ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేయగా.. సౌత్ గ్రూపులో ఎమ్మెల్సీ కవిత పాత్రపై విచారణ కొనసాగుతుందని.. ఈ సమయంలో నిందితులకు బెయిల్ ఇవ్వటం ద్వారా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. విచారణ పూర్తి కాకుండా బెయిల్ ఇవ్వొద్దని.. నిందితులు, అనుమానితులందరి విచారణ ఇంకా కొనసాగుతుందని కోర్టులో ఈడీ స్పష్టం చేసింది. పిటిషన్ ను పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు.. అభిషేక్ బోయినపల్లి మధ్యంతర బెయిల్ పిటీషన్ పై విచారణను ఏప్రిల్ 12వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలావుంటే చట్టంపై గౌరవంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరవుతున్నారని ఎంపీ రంజిత్ రెడ్డి వెల్లడిరచారు. ఈడీ విచారణకు భయపడి కాదని.. చట్టంపై గౌరవంతో కవిత వెళ్తున్నారాని తెలిపారు. విపక్షాలను టార్గెట్ చేసి దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈడీ విచారణకు హాజరవ్వాలా లేదా అన్న అంశంపై న్యాయవాదులతో ఎమ్మెల్సీ కవిత చర్చలు జరిపారు. సుధీర్ఘ చర్చల తర్వాత ఈడీ విచారణకు హాజరవ్వాలని ఎమ్మెల్సీ కవిత నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 10:30 గంటలకు ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి బయలుదేరారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 20న హాజరవ్వాలంటూ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తో కలిసి ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే సీబీఐ విచారించింది. ఆ తర్వాత మార్చి 11న ఢిల్లీలో ఈడీ ముందు విచారణకు కవిత హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత రాత్రి 8.05 నిమిషాలకు తిరిగి వచ్చారు. ఇదే సమయంలో ఈడీ మార్చి 16న రావాలని నోటీసు ఇచ్చింది. కానీ ఆ రోజు ఆమె హాజరవలేదు. దీంతో ఈడీ 20వ తేదీన హాజరవ్వాలని కవితకు మరోసారి నోటీసులు పంపింది. ఈ క్రమంలో ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికార నివాసం నుంచి కవిత తన భర్త అనిల్, సీనియర్ అడ్వకేట్ సోమా భరత్ కుమార్తో కలిసి ఈడీ కార్యాలయానికి బయల్దేరారు. కవితకు మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత వారందరికీ అభివాదం చేశారు. కవిత ఈడీ విచారణకు హాజరు కావడం ఇది రెండోసారి. ఈ నెల 11న కవిత తొలిసారి ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. మళ్లీ 16వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీచేసింది. ఈడీ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గత గురువారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఈడీ ఈ నెల 7, 11 తేదీల్లో తనకు సమన్లు ఇచ్చిందని, మనీలాండరింగ్ నిరోధక చట్టం`2002లోని 50(2), 50(3) నిబంధనల మేరకు ఇచ్చిన నోటీసు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వు జారీ చేయాలని కోరారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వికలాంగులు, మహిళలను ఇండ్ల వద్దే విచారించాలని, ఈడీ ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నదని పేర్కొన్నారు. తనను కార్యాలయానికి పిలిచి ఈడీ విచారించటం చట్టవ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. తన ఇంటి దగ్గర ఈడీ విచారణ చేయటమో, లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ విధానంలో దర్యాప్తు చేసేలా ఉత్తర్వులివ్వాలని కోరారు.