- ప్రాణాలు అరచేతిలొ పెట్టుకొని పరుగులు
- అయినా వదలని
- భూ కబ్జాదారులు
- తెరవెనుక చక్రం తిప్పుతున్న అధికార పార్టీ నేతలు
జక్కలొద్ది భూముల జగడం రోజుకో మలుపు తిరుగుతోంది. గురువారం రాత్రి పలువురు భూ కబ్జాదారులు
40-50మంది అల్లరి మూకలతో కలిసి మహిళలు, గుడిసెవాసులపై దాడులకు పాల్పడ్డారు. కర్రలు, బీరు సీసాలతో విచక్షణారహితంగా కొట్టారు. చెప్పలేని విధంగా మహిళలను తిడుతూ పాశవిక ఆనందం పొందారు. గూండాల దాడిలో ఒకరికి తలకు తీవ్ర గాయం కాగా, మరొక మహిళ చేయి విరిగింది. దీంతో గుడిసెవాసులు ప్రాణభయంతో పరుగులు తీశారు. రక్షించాలంటూ పలుమార్లు 100 డయల్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. కూతవేటు దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉన్నా వారు కూడా స్పందించలేదని గుడిసెవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి పూట కొంతమంది రౌడీల్లా ప్రవర్తిస్తున్నా అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్రపై మహిళా లోకం భగ్గుమంటోంది. కాగా జక్కలొద్ది భూములను రక్షించాలంటూ గతంలోనే వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అయినా ప్రభుత్వంనుంచి నేటికీ స్పందన కరువైంది.
-వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి
- అర్ధరాత్రి మహిళలు,
- గుడిసెవాసులపై దాడి
- ప్రాణాలు అరచేతిలొ పెట్టుకొని పరుగులు
- అయినా వదలని భూ కబ్జాదారులు
- సహకరిస్తున్న పోలీసులు
- తెరవెనుక చక్రం తిప్పుతున్న
- అధికార పార్టీ నేతలు
- భూములు రక్షించాలంటూ అసెంబ్లీలో కోరిన తూర్పు ఎమ్మెల్యే
- అయినా స్పందించని ప్రభుత్వం
వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి : జక్కలొద్ది భూముల జగడం రోజుకో మలుపు తిరుగుతోంది. మిగులు భూమిలో గత 25 రోజులుగా పేదలు గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తుండగా వారిని అడ్డుకునేందుకు కొంతమంది రియల్టర్లు స్థానిక అల్లరి మూకలతో కలిసి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం రాత్రి కూడా ఇదే తంతు కొనసాగింది. రెక్కాడితేకాని డొక్కాడని గుడిసెవాసులు ఉదయం వివిధ పనులకు వెళ్లి సాయంత్రం తిరిగి గుడిసెలకు వస్తుండగా పోలీసులు వారికి చుక్కలు చూపించారు. రహదారికి అడ్డుగా వాహనాన్ని నిలిపి గుడిసెల వద్దకు ఎవరినీ పోకుండా అడ్డుకున్నారు. భార్య, పిల్లలు గుడిసెల్లోనే ఉన్నారంటూ వేడుకున్నా పోలీసులు కనికరించలేదని గుడిసెవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
రాత్రి పవర్ కట్..
గురువారం రాత్రి 9గంటలకే గుడిసెలకు వచ్చే కరెంట్ కట్ చేశారు. చిమ్మచీకటిలో ఉన్న గుడిసె వాసులపై సుమారు 40-50మంది దాడులకు పాల్పడ్డారు. కర్రలు, బీరు సీసాలతో విచక్షణా రహితంగా కొట్టారు. స్థానికంగా గప్చుప్లు అమ్ముకునే వ్యక్తిపై కూడా దాడికి పాల్పడ్డారు. అతడు వాడే సిలిండర్ను ఎత్తి దూరంగా విసిరేశారు. నోటికొచ్చిన బూతులు తిట్టారు. మహిళలు అనికూడా చూడకుండా సిగ్గుతో తలదించుకునేలా తిట్ల పురాణం వల్లించినట్లు స్థానికులు వెల్లడిరచారు. కర్రలతో దాడులు చేయడంతో గుడిసె వాసులు ప్రాణాలను అరచేతిలొ పెట్టుకొని పరుగులు తీశారు. చెట్టుకొకరు, గుట్టకొకరు అన్న చందంగా మారింది. ఈ దాడిలో గుడిసెలో నివాసముంటున్న చిలక రమేష్కు భారీ గాయమైంది. దాడి ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించిన గర్భిణిపైకూడా దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇలా అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిపై తమ ప్రతాపాన్ని చూపించారు. ఆర్ధరాత్రి వరకు అక్కడే కలియ తిరుగుతూ మారణహోమం సృష్టించారు.
పోలీసుల నో రెస్పాన్స్..
కొంతమంది రౌడీలు మూకుమ్మడిగా తమపై దాడులు నిర్వహిస్తున్నారు.. రక్షించాలంటూ పలుమార్లు 100 డయల్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. కూతవేటు దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉన్నా వారు కూడా స్పందించలేదని గుడిసెవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పూట కొంతమంది విచక్షణ కోల్పోయి రౌడీల్లా ప్రవర్తిస్తున్నా అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై మహిళా లోకం భగ్గుమంటోంది. ప్రజల మాన, ప్రాణాలను కాపాడాల్సిన పోలీసులు భూకబ్జా దారులకు అండగా నిలిచి దాడులను ప్రోత్సహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడిసెలు వేసుకోవద్దంటే మీరు వినలేదుకదా..అనుభవించడండి అన్నట్లు పోలీసుల వైఖరి ఉందని ఆరోపిస్తున్నారు.
246 ఎకరాలను కాపాడాలి..
జక్కలొద్దిలోని మొత్తం 296 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇప్పటికే 246 ఎకరాల భూమిని కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో కబ్జా చేశారు. ప్రస్తుతం మిగిలింది కేవలం 50 ఎకరాలు మాత్రమే. దీనిని కూడా బడా బాబులు ఆక్రమించుకునేందుకు యత్నిస్తే పేదలు ఎదిరించి గుడిసెలు వేశారు. దీనిని జీర్ణించుకోలేని భూ కబ్జాదారులు పేదలపై దాడులకు దిగుతున్నారు. వారు వేసిన గుడిసెలను తొలగించేందుకు శతవిధాల కృషి చేస్తున్నారు. ఇందుకు కావాల్సిన సహాయాన్ని పోలీసుల నుంచి పొందుతున్నారు. 246 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన భూ కబ్జాదారులను కాపాడుతూ కేవలం గూడు కోసం వేసుకున్న గుడిసెలను పోలీసులు తొలగించడంపై పేదలు మండిపడుతున్నారు.