సింగరాజుపల్లిని మండల కేంద్రం చేయాలని వినతి
పరిశీలిస్తామని హామీ
వరంగల్ వాయిస్, జనగామ: నిత్యం జనంలోనే, జనంతోనే ఉండే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తన స్థాయి, స్థానం కోసం ఏనాడూ చూడరు. జనంతో ఉండటమే ముఖ్యమనుకుంటారు. అలా… అనేక సందర్భాల్లో ప్రవర్తించిన మంత్రి మరోసారి తన రూటే సెపరేటని నిరూపించారు. బుధవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలామ్ విగ్రహావిష్కరణకు వెళ్తూ జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం కుందారం (పటేల్ గూడెం) క్రాస్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నియోజకవర్గంలోని సింగరాజుపల్లి, ఆ చుట్టు పక్కల గ్రామాలకు చెందిన పలువురు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆ పక్కనే ఉన్న చిన్న గుడిసె హోటల్ ముందు ఆగారు. అక్కడే ప్రయాణికుల కోసం వేసి ఉన్న ఓ చైర్ మీద కూర్చున్నారు. వాళ్లతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు సింగరాజుపల్లి చుట్టు పక్కల గ్రామాలను కలిపి మండల కేంద్రం చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసి వారిలో దేవరుప్పుల పీఎసీఎస్ చైర్మన్ లింగాల రమేశ్ రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కత్తుల విజయ్, పెద్ద మడూరు సర్పంచ్ పెద్దారెడ్డి, సింగరాజుపల్లి సర్పంచ్ మల్లేశ్, నేలపోగుల సర్పంచ్ దూసరి గణపతి, చిన్నమడూరు ఎంపీటీసీ మల్లికార్జున్, ధరావత్ తండా సర్పంచ్ గేమా, నల్లకుంట తండా సర్పంచ్ రాజన్న, టీఆర్ఎస్ మండల శాఖ ఉపాధ్యక్షుడు ఉమేశ్, పార్టీ సీనియర్ నాయకులు సంజీవరెడ్డి, భిక్షపతి, బండి నర్సింహులు, మేడ వెంకటేశ్, జోగు సోమరాజు, వంగ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.