వరంగల్ వాయిస్, హనుమకొండ : ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తమ వంట గ్యాస్ వాడకం దారులకు ప్రాథమిక భద్రతలో భాగంగా ఇంటింటికి తమ డెలివరీ సిబ్బంది సందర్శించి వాడకం దారులు వినియోగిస్తున్న ఇండేన్ గ్యాస్ పనితీరును గమనించి తొమ్మిది ఆంశాలతో కూడిన ప్రశ్నావళిని డెలివరి బాయ్ ఆప్ ద్వారా ఆయిల్ కంపెనీకి అనుసందానం చేస్తారని ఉమ్మడి ఆంద్రప్రదేశ్ డీలర్ల పూర్వ ప్రధాన కార్యదర్శి పీవీ.మదన్ మోహన్ తెలిపారు. ఇటీవల జరిగిన గ్యాస్ ప్రమాదాలు పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లోఅవగాహన లోపంతో జరిగాయని వచ్చిన నివేదిక ఆధారంగా అన్ని ఆయిల్ కంపెనీలు తమ వద్ద నమోదైన గ్యాస్ వాడకం దారులకు ప్రాథమిక భద్రతా చర్యలు చేపట్టాలని నిర్ణయించాయని అన్నారు. గ్యాస్ లీకేజి వాసన గుర్తిస్తే 1906 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు. సురక్ష రబ్బరు ట్యూబ్ ఇటాలియన్ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారని, దాని కాలపరిమితి ఐదు సంవత్సరాలు,
తయారీ తేది, కాలం, చెల్లిన తేదీని గమనించి నూతన రబ్బరు ట్యూబ్ కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. గ్రీన్ రబ్బరు ట్యూబ్, నాన్ ఐస్ఐ రబ్బరు ట్యూబుల వాడకం ప్రమాదకరమని పేర్కొన్నారు. ఏ కంపెనీ గ్యాస్ వాడతున్నామో ఆ కంపెనీకి చెందిన సిలిండర్ రెగ్యులేటర్ వాడే విధంగా జాగ్రత్త తీసుకోవాలి, లేకుంటే ప్రమాద బీమా వర్తించదన్నారు. శాశ్వత వంటగ్యాస్ ప్లాట్ ఫాం లేకుండా చెక్క బల్లల ఏర్పాటు మనకు మనమే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవం అన్నారు. కస్టమర్ల భద్రతా చర్యల కోసం ఆయిల్ కంపెనీలు అందిస్తున్న సహకారాన్ని నిండు మనసుతో స్వాగతించాలని ఈ సందర్భంగా పీవీ.మదన్ మోహన్ విజ్ఞప్తి చేశారు.
