- సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారీ
వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : జులై 1 నుంచి అమలు కానున్న నూతన చట్టాలపై ప్రతి ఒక్క పోలీసు అధికారికి కొత్త చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలని సెంట్రల్ జోన్ డీసీపీ పోలీస్ అధికారులు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు సిబ్బందికి నూతన చట్టాలపై అవగాహన కల్పించడంలో భాగంగా విడతల వారీగా ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో భాగంగా స్థానిక ములుగు రోడ్డులోని ఎల్ బీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ తరగతులను సెంట్రల్ జోన్ డీసీపీ ముఖ్యం అతిధిగా హాజరై శిక్షణ తరగతులను గురువారం ప్రారంభించారు. వరంగల్, హనుమకొండ డివిజన్లకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో డీసీపీ మాట్లాడుతూ జులై 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త చట్టాలను అమలు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకు అనుగుణంగా జులై 1 నుంచి కొత్త చట్టాలను అనుసరిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు. కొత్త చట్టాల గురించి ప్రతి ఒక్క అధికారి, సిబ్బందికి పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఇందులో భాగంగా జిల్లా పోలీసులందరికీ విడతల వారీగా శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందన్నారు. కొత్త చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం-2023 చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉన్నపుడే సమర్ధవంతంగా విధులు నిర్వహించగలమని, కొత్త చట్టాలపై అవగాహన రావాలంటే నేర్చుకోవాలనే తపన మనలో ఉన్నప్పుడే సాధ్యమవుతుందని డీసీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు నందిరామ్ నాయక్, దేవేందర్ రెడ్డి, ఇన్ స్పెక్టర్లు గోపి, శివకుమార్, మల్లయ్య, సంజీవ్, సత్యనారాయణ రెడ్డి, సుధాకర్ రెడ్డితో పాటు ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
