టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
వరంగల్ వాయిస్, హనుమకొండ : కాకతీయ యూనివర్సిటీని మూయించేందుకు కుట్ర జరుగుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో యూనివర్శిటీలు లేకుండా చేయాలన్నదే కేసీఆర్ ఆలోచన అని ఆయన మండి పడ్డారు. ఇటీవల పోలీసుల చేతిలో గాయపడిన కేయూ విద్యార్థి సంఘం నేతలను రేవంత్ రెడ్డి పరామర్శించారు. బుధవారం నగరానికి విచ్చేసిన ఆయన దీక్ష చేస్తున్న విద్యార్థులను కలిసి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్శిటీలో పీహెచీ అడ్మిషన్లలో జరిగిన అవకతవకలపై ప్రశ్నిస్తే విద్యార్థులపై దాడులు చేశారని నిప్పులు చెరిగారు. వీధి రౌడీలా మాదిరిగా విద్యార్థులను కొట్టిస్తున్నారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. యూనివర్శిటీల్లో జరిగే అన్యాయాలపైనే విద్యార్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే శత్రువుల మాదిరిగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. కాకతీయ వర్శిటీలో జరిగిన అన్యాయాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధనలో విద్యార్థి ఉద్యమకారులే ముఖ్య భూమిక పోషించిన విషయాన్ని మరువరాదన్నారు. పోలీసుల చేతిలో దాడులకు గురైన విద్యార్థులకు క్షమాపణ చెప్పాలన్నారు. విద్యార్థులపై దాడులు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. కాకతీయ యూనివర్శిటీ రిజిస్ట్రార్, వీసీని సస్పండ్ చేయాలన్నారు.