- లేదంటే బర్తరఫ్ చేయాలి
- నిరుద్యోగులకు పరిహారం చెల్లించాలి
- మహాధర్నాలో బండి సంజయ్ డిమాండ్
వరంగల్ వాయిస్,హైదరాబాద్: టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ కేసులో అసలు నిందితులెవరో తేల్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. దోషలును తేల్చడంతో పాటు, కెటిఆర్ రాజీనామా చేయాలన్న డిమాండ్ను మరోమారు తెరవిూదకు తెచ్చారు. అదే సందర్భంలో నిరుద్యోగులకు కనీసం లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలన్న డిమాండ్ చేస్తున్నారు. ఇందిరాపార్క్ వద్ద బీజేపీ నిరుద్యోగ మహాధర్నాలో పాల్గొన్న బండి సంజయ్.. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పేపర్ లీక్ కేసులో విచారణ జాప్యం చేస్తూ నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని .. లేకపోతే భర్తరఫ్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణకు అభ్యంతరమేంటని ప్రశ్నించారు.పేపర్ లీక్ కేసులో ఇద్దరే నిందితులన్న కేటీఆర్.. సిట్ 11 మందిని ఎందుకు అరెస్ట్ చేసిందో సమాధానం చెప్పాలన్నారు. పరీక్ష రాసి నష్టపోయిన అభ్యర్థులందరికీ రూ. లక్షచొప్పున పరిహారం ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 30 లక్షల నిరుద్యోగుల భవిష్యత్ ను కేసీఆర్ ప్రభుత్వం అందకారం చేసిందన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు అండగా బీజేపీ ఉంటుంద న్నారు. వచ్చేది రామరాజ్యమని.. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని తెలిపారు. పేపర్ లీక్ కేసులో ప్రభుత్వ మెడలు వంచేదాకా ఉద్యమిస్తామని చెప్పారు. సిట్ అధికారులను తానే రమ్మన్నాని.. నోటీసులు కూడా తీసుకున్నానని బండి సంజయ్ చెప్పారు. కేసీఆర్ కొడుకు నౌకరీ ఊడగొట్టాలె..మా నౌకరీలు మాకు కావాలె అని బండి సంజయ్ అన్నారు. మహాధర్నాకు పరిమిత సంఖ్యలో నిరుద్యోగులను అనుమతించారు.
